|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 02:02 PM
యంగ్ హీరో రామ్ పోతినేని తన తాజా చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' విడుదల విషయంలో ఒకానొక దశలో భయపడినట్లు వెల్లడించారు. గతంలో వెంకటేశ్తో కలిసి తాను నటించిన 'మసాలా' సినిమా నవంబర్లో విడుదలై ఆశించిన విజయం సాధించలేదని, ఆ సెంటిమెంట్తో ఈ సినిమా నవంబర్ రిలీజ్కు కాస్త ఆందోళన చెందానని తెలిపారు. చిత్ర యూనిట్ నిర్వహించిన థాంక్స్ మీట్లో ఆయన ఈ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ.. ఎక్కువ మంది ప్రేక్షకులు చూడాలనే ఉద్దేశంతోనే 'ఆంధ్ర కింగ్ తాలూకా' తీశామని, కానీ కొన్ని పరిస్థితుల వల్ల అన్ సీజన్లో విడుదల చేయాల్సి వచ్చిందన్నారు. ఈ సినిమాకు తాను ఎంతగానో కనెక్ట్ అయ్యానని, అందుకే ఏ సినిమాకూ చేయనంత ప్రచారం చేశానని వెల్లడించారు. హీరో-అభిమాని మధ్య ఉండే అనుబంధాన్ని చూపించే చిత్రం ఇది అని వివరించారు.సినిమా ఫలితంపై స్పందిస్తూ.. మిగతా సినిమాల విషయంలో హిట్టా? ఫట్టా? అని ఆలోచిస్తాం కానీ ఈ సినిమా విషయంలో ఇది మంచి సినిమా అని ప్రేక్షకులు వెంటనే గుర్తిస్తారా లేక ఆలస్యంగా గుర్తిస్తారా అనేదే తమ ఆలోచన అని అన్నారు. విడుదల రోజే కలెక్షన్ల రికార్డులు కొట్టాలన్న ఉద్దేశం తమకు లేదని, ప్రేక్షకుల అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని అన్నారు. ప్రేక్షకులకు నచ్చకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తానని రామ్ స్పష్టం చేశారు.
Latest News