|
|
by Suryaa Desk | Sun, Nov 30, 2025, 01:58 PM
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'కాంతార' సినిమాలోని కీలక సన్నివేశాన్ని అనుకరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కన్నడిగులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) ముగింపు వేడుకలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన రణ్వీర్, 'కాంతార'లో రిషబ్ శెట్టి నటన అద్భుతమని ప్రశంసించారు. ముఖ్యంగా దైవం ఆవహించిన సన్నివేశాలు బాగున్నాయని అన్నారు. అయితే, ఆ తర్వాత స్టేజ్పై 'కాంతార'లో ఫేమస్ అయిన 'ఓ' అనే శబ్దాన్ని కామెడీగా చేసి చూపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న రిషబ్ శెట్టి కొంత అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రణ్వీర్ను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కన్నడిగులు ఎంతో పవిత్రంగా భావించే దైవానికి సంబంధించిన సన్నివేశాన్ని అపహాస్యం చేయడం సరికాదని మండిపడుతున్నారు. వెంటనే 'కాంతార' చిత్ర బృందానికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన నటిస్తున్న 'ధురంధర్' సినిమా విడుదలను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
Latest News