|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:14 PM
రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేశ్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ బాబు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ కథ 2002 కాలంలో నడుస్తుందని, అప్పటి ఫ్యాన్ కల్చర్ను, హీరోల పట్ల అభిమానులు చూపించే ప్రేమను ఈ చిత్రంలో బలంగా చూపించబోతున్నామని తెలిపారు. అందుకే ఈ టైటిల్ సరిగ్గా సరిపోయిందని, దాని వెనుక ఉన్న అసలు అర్థం థియేటర్లో తెలుస్తుందని అన్నారు.ఈ సినిమా కథ పుట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ, ‘‘రానా హోస్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర గారు ‘నిజమైన నన్ను సినిమాల్లోనే చూస్తారు’ అని చెప్పిన మాట నాలో బలంగా నాటుకుపోయింది. అదే ఈ కథకు బీజం వేసింది. ఒక అభిమాని తన హీరోను ఎలా చూస్తాడు, ఆ ప్రేమలో ఎంత భావోద్వేగం ఉంటుందనే కోణంలో సూర్య అనే పాత్రను సృష్టించాను. ఆ పాత్రకు ఉపేంద్ర గారు అయితేనే బాగుంటుందనిపించింది’’ అని మహేశ్ బాబు తెలిపారు.
Latest News