|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 07:21 PM
విలక్షణ నటుడు ఆర్. మాధవన్ ప్రస్తుతం ప్రతిష్ఠాత్మక బయోపిక్ 'జీడీఎన్' చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. భారతీయ పారిశ్రామిక మార్గదర్శకుడు, సాంకేతిక రూపకర్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ చిత్రీకరణ విదేశాల్లో శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా మాధవన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు షూటింగ్ విశేషాలను పంచుకుంటూ వారిలో ఆసక్తిని పెంచుతున్నారు.తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్లో ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోలో మాధవన్, అత్యంత ఆధునికమైన హోండా గోల్డ్వింగ్ స్పోర్ట్స్ టూరింగ్ బైక్పై షూటింగ్ లొకేషన్కు రావడం చూడొచ్చు. బైక్ ఆపిన తర్వాత జీడీ నాయుడు గారి సినిమా షూటింగ్కు రావడానికి ఇదే అత్యుత్తమ మార్గం. మీరేమంటారు?" అని నవ్వుతూ ప్రశ్నించి, అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. ఈ వీడియోకి అనే క్యాప్షన్ జోడించి, తన సంతోషాన్ని ఎమోజీల రూపంలో వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గత అక్టోబర్లో చిత్ర బృందం ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ టీజర్లో జీడీ నాయుడు పాత్రలోకి మాధవన్ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్లు కనిపించారు. తన వర్క్షాప్లో తీవ్రంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తగా ఆయన కనిపించారు. మొదట వెల్డింగ్ షీల్డ్తో ముఖం కప్పి ఉన్నా, ఆ తర్వాత దాన్ని తొలగించగా, కళ్లజోడుతో వయసు మళ్లిన గంభీరమైన అవతారంలో దర్శనమిచ్చారు. 'భారతదేశపు ఎడిసన్'గా పేరుగాంచిన జీడీ నాయుడు పాత్రలో ఆయన మేకోవర్ అద్భుతంగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆ టీజర్ను పంచుకుంటూ, "జీడీ నాయుడు స్ఫూర్తి అధికారికంగా ఆవిష్కరించబడింది. అసమానమైన దార్శనికత, ఉన్నతమైన ఆశయం, దృఢమైన సంకల్పం ఉన్న ఒక వ్యక్తికథ ఇది" అని మాధవన్ పేర్కొన్నారు.'జీడీఎన్' చిత్రం కోయంబత్తూరుకు చెందిన స్వయంకృషితో ఎదిగిన ఇంజనీర్, ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త అయిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు జీవితాన్ని కళ్లకు కడుతుంది. దేశంలో మొట్టమొదటి స్వదేశీ ఎలక్ట్రిక్ మోటారును అభివృద్ధి చేసి భారతీయ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆయనది. పెట్రోల్ ఇంజన్లు, టికెట్ మెషీన్లు, వ్యవసాయ పరికరాలు వంటి మరెన్నో ఆవిష్కరణలు ఆయన చేశారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి, జయరాం, యోగి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివరి షెడ్యూల్ పూర్తికావస్తుండటంతో, ఈ స్ఫూర్తిదాయక బయోపిక్ను తెరపై చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Latest News