|
|
by Suryaa Desk | Wed, Jul 23, 2025, 05:15 PM
గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరిటీ, 'జూనియర్' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ఈవెంట్స్ లలో .. ఇంటర్వ్యూలలో కిరిటీ చాలా వినయంతో కనిపించాడు. ఇంటర్వ్యూలలో తగ్గి మాట్లాడటం .. ఈవెంట్స్ లో సీనియర్స్ ను గౌరవించడం .. వాళ్ల పాదాలకు నమస్కరించడం చేశాడు. వేలకోట్ల ఆస్తులున్నా ఆయన అంత వినయంతో ఉండటం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదంతా యాక్టింగ్ అంటూ కొంతమంది కొట్టిపారేశారు. ఈ విషయాన్ని గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ మాస్టర్ ప్రస్తావించాడు. ఈ సినిమాలో రెండు పాటలకు ఆయన కొరియోగ్రఫీని అందించాడు. అందులో ఒకటైన 'వైరల్' సాంగ్ నిజంగానే వైరల్ అయింది. రేవంత్ మాట్లాడుతూ .. " ఈ పాటల రిహార్సల్స్ కోసం నేను కిరీటీ వాళ్ల ఇంట్లో రెండు నెలల పాటు ఉన్నాను. వాళ్లంతా మా టీమ్ ను ఎంతో అభిమానంతో చూసుకున్నారు. కిరీటీ మాతోపాటే తిని తాగాడు. ఎప్పుడూ కూడా తన స్థాయిని చూపించే ప్రయత్నం చేయలేదు" అని చెప్పాడు. "తన కంటే వయసులో పెద్దవాళ్ల పాదాలకు నమస్కరించే సంస్కారం కిరీటికి ఉంది. నేని చాలా చిన్న డాన్సర్ ని. మా అమ్మని పరిచయం చేస్తే, మా అమ్మ పాదాలకి కూడా నమస్కారం పెట్టాడు. అప్పుడు నిజంగా నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అలాంటి కిరీటీ, స్టార్స్ పాదాలకి నమస్కరించడం యాక్టింగ్ ఎలా అవుతుంది? .. అది ఆయన పెంపకంలోనే ఉంది. ఎంత పేరొచ్చినా .. ఏ స్థాయికి ఎదిగినా అహంభావానికి వెళ్లొద్దని జనార్ధన్ రెడ్డిగారు నాతో అనడమే అందుకు నిదర్శనం" అని చెప్పాడు.
Latest News