|
|
by Suryaa Desk | Tue, Jul 22, 2025, 02:20 PM
పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ నెల 24న విడుదలవుతోంది. హైదరాబాద్లో సోమవారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చిత్రబృందం పాల్గొంది. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ ‘ఒక సినిమా చేయడమంటే ఎన్నో యుద్ధాలు చేయాలి. అది ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు. ప్రాంతీయ స్థాయి సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఏ.ఎమ్.రత్నం. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రత్నం పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రతిపాదించాను. ఆయన నా నిర్మాత అని కాదు.. ఇలాంటి వ్యక్తి ఉంటే సినీ పరిశ్రమ బాగుంటుందని ప్రతిపాదించాను. సినిమా అంటే నాకు అపారమైన గౌరవం. రత్నం లాంటి నిర్మాత ఇబ్బంది పడకూడదని ఈ సినిమాని నా భుజాలపైకి తీసుకున్నాను. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉంటే ఎవరైనా సినీ రంగంలో రాణించవచ్చు. ‘భీమ్లానాయక్’ విడుదలైనప్పుడు అందరి సినిమాల టిక్కెట్లు వందల్లో ఉంటే, నా సినిమాకు పదుల్లో ఉండేవి. నేనెప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నించను. అసలు నేను యాక్టర్ అవ్వాలనే కోరుకోలేదు. ఒక సగటు మనిషిగా జీవించాలనే ఆలోచన తప్ప నాలో ఏం లేదు. ఒక సినిమా చేయాలంటే చాలా కష్టం. హిట్లు, ఫ్లాప్స్ కాకుండా నేను అభిమానులు చూపే ప్రేమనే నమ్మాను. నా బలం మీ అందరి అభిమానమే. కీరవాణి అద్భుతమైన సంగీతం ఇచ్చారు. మనోజ్ పరమహంస ఈ సినిమా కోసం ప్రాణం పెట్టారు. చిత్రీకరణకు వారానికి ఐదు రోజుల్లో రోజూ రెండు గంటలే కేటాయించినా, దానికి తగ్గట్లు వర్క్ చేసిన టీమ్ కృషి వెలకట్టలేనిది. చిత్ర ప్రమోషన్స్ కోసం నిధి అగర్వాల్ ఎంతో కష్టపడ్డారు. ఈ విషయంలో ఆమెను అభినందించాలి.ఈ సినిమా సబ్జెక్ట్ నాకు చాలా ఇష్టమైనది. ఇందులో నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఉపయోగించిన క్లైమాక్స్లో 18 నిమిషాల ఫైట్ కంపోజ్ చేశా’’ అని అన్నారు.
Latest News