![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jun 25, 2025, 07:30 PM
ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తన సినిమాలతోనే కాకుండా అప్పుడప్పుడు ఇతర విషయాలతోనూ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ వీడియో గేమ్లో కనిపించనుండటం సినీ వర్గాల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించిన విజువల్స్, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.పూర్తి వివరాల్లోకి వెళితే.. వీడియో గేమ్ ప్రియులకు సుపరిచితమైన పేరు హిడియో కోజిమా. ఆయన సృష్టించిన 'డెత్ స్ట్రాండింగ్' గేమ్ ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. ఇప్పుడు ఈ గేమ్కు కొనసాగింపుగా వస్తున్న "డెత్ స్ట్రాండింగ్ 2"లో రాజమౌళి, ఆయన తనయుడు కార్తికేయ కూడా కనిపించనున్నారు. ఈ గేమ్లో ప్రముఖ హాలీవుడ్ నటులు నార్మన్ రీడస్, ఎల్లీ ఫానింగ్ వంటి వారు కూడా నటిస్తున్నారు. ఈ వీడియో గేమ్ ఈనెల 26 నుంచి ప్లేస్టేషన్లో అందుబాటులోకి రానుంది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ గేమ్లో రాజమౌళిది ఓ వినోదాత్మకమైన అతిథి పాత్ర అని తెలుస్తోంది.కాగా, రాజమౌళికి, గేమ్ డైరెక్టర్ హిడియో కోజిమాకు 2022లోనే పరిచయం ఏర్పడింది. 'ఆర్ఆర్ఆర్' సినిమా జపాన్లో ఘనవిజయం సాధించిన సందర్భంగా రాజమౌళి జపాన్ వెళ్లినప్పుడు కోజిమాను కలిశారు. అప్పట్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే, అది కేవలం సినిమా పనుల్లో భాగంగానే జరిగి ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఇప్పుడు ఇలా వీడియో గేమ్లో రాజమౌళి ప్రత్యక్షం కానుండటంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
Latest News