|
|
by Suryaa Desk | Fri, Jan 30, 2026, 07:19 PM
కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి చాలా మందికి అవగాహన లేక మిస్ చేసుకుంటున్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు కొంతమందికి మాత్రమే వాటి ప్రయోజనాలు దక్కుతున్నాయి. దీనిలో భాగంగానే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కూడా ఒకటి. నిరుపేద కుటుంబాలకు, సామాన్య ప్రజలకు ఆర్థిక రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాన్ని 2015 మే 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలకత్తాలో ప్రారంభించారు.
ఆ రోజు నుంచి కూడా ఈ పథకం దేశ వ్యాప్తంగా అమలు అవుతోంది. దీనిలో చేరేందుకు ప్రీమియం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని బ్యాంకులు వీటిపై అవగాహన కల్పిస్తూ.. కస్టమర్లను చేర్పిస్తున్నారు. తాజాగా ఈ పథకంపై అవగాహన కల్పించేందుకు నిజామాబాద్ జిల్లా తపాలా శాఖ అధికారులు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ జనార్దన్ రెడ్డి ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను వివరించారు.
ఇన్సూరెన్స్ అంటే చాలామందికి ఎక్కువ ప్రీమియం కట్టాల్సి వస్తుందనుకుంటున్నారు. రోజూ వారి కూలీకి వెళ్తే తప్ప ఇంట్లో గడవని కుటుంబాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి. అటువంటి వారు ఇన్సూరెన్స్ అంటేనే దూరంగా ఉంటున్నారు. కానీ.. ఈ పథకంలో ఎక్కువ మొత్తంలో ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. రోజుకు కేవలం రూ.1.20 పైసలు అంటే ఏడాదికి కేవలం రూ.436 చెల్లిస్తే చాలు. ఏదైనా కారణంతో బీమా చేయించుకున్న వ్యక్తి మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందుతుంది.
కుటుంబ పెద్దను కోల్పోయి వీధిన పడే ఎన్నో పేద కుటుంబాలకు ఇది కొండంత అండగా నిలుస్తుందని తపాలా శాఖ అధికారి తెలిపారు. ఈ పథకంలో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరూ చేరవచ్చు. 50 ఏళ్లు దాటిన వారు దీనిలో చేరేందుకు అర్హులు కారు. ఈ పాలసీ యొక్క కాలపరిమితి అనేది.. ప్రతీ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు వర్తిస్తుంది.
ఒక వేళ మీకు తపాళా శాఖలో పొదుపు ఖాతా ఉంటే.. ఆటో డెబిట్ రూపంలో సంవత్సరానికి ఒకేసారి ప్రీమియం కట్ చేసుకుంటారు. దీనివల్ల ప్రతిసారి ఆఫీసులకు రావాల్సిన అవసరం ఉండదు. అంతే కాకుండా.. ఈ పథకానికి ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది. ధనవంతులకు మాత్రమే ఒకప్పుడు ఇన్సూరెన్స్లు అందుబాటులో ఉండేది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రీమియంలు సామాన్యులకు భారంగా ఉండేవి. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో సామాజిక భద్రత లభిస్తోందని జనార్ధన్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ దీనిని వినియోగించుకోవాలన్నారు.