|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 07:13 PM
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ నిన్న రాత్రి సమావేశం కావడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ భేటీపై మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. ఉప ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశం కాకూడదా అని ఆయన ప్రశ్నించారు.మంత్రులు తనతో భేటీ కావడం సాధారణ విషయమేనని ఆయన స్పష్టం చేశారు. ఇది పాలనాపరమైన అంశాలపై జరిగిన సమావేశమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేనందున మంత్రులు ఉప ముఖ్యమంత్రిగా తనతో చర్చించేందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కలిసి ఒక ఉమ్మడి కుటుంబంలా పనిచేస్తున్నామని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ భేటీ జరగడం చర్చకు దారి తీసిందని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ, కొందరు పిచ్చివాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.