|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:11 PM
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిన విషయం తెలిసిందే. మొదటి దశలో భాగంగా బిహార్లో.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఓటర్ల జాబితా సవరణ చేపట్టింది. ఆ తర్వాత రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత పాంత్రాల్లో ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దాని ప్రకారం ఒక్కో రాష్ట్రంలో భారీగా ఓటర్లను తొలగించింది. అత్యధికంగా ఉత్తర్ప్రదేశ్లో 2.89 కోట్ల ఓటర్లను తొలగించింది. తర్వాతి దశలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా భారీ సంఖ్యలో ఓటర్లను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోంది.
తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో.. ఎస్ఐఆర్ తర్వాత ఓటర్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తంగా 6.5 కోట్ల ఓట్లను తొలగించారని ఉదహరిస్తున్నారు. తెలంగాణలో కూడా ఇలాగే జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా, ఓటరు జాబితాలో పేర్లు తొలగించిన వారిని.. "గైర్హాజరు, వేరే చోటుకు మారినవారు లేదా మరణించిన/ నకిలీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెడ్/డుప్లికేట్- ASD)" అనే కేటగిరీల్లోకి విభజిస్తున్నారు. "ఆబ్సెంట్" అంటే ఆచూకీ లభించని వారు. "షిఫ్టెడ్" అంటే మరొక ప్రదేశానికి వలస వెళ్లినవారు. "డెడ్/డుప్లికేట్" అంటే చనిపోయినప్పటికీ ఓటర్ల జాబితాలో ఉన్న ఓటర్లు, ఒకటి కంటే ఎక్కువసార్లు జాబితాలో కనిపించే పేర్లు.
కాగా, గత మూడు సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదు అయింది. 2024 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్లో48.7, 2019లో 45.8, 20214లో 53.3 శాతం నమోదు అయింది. అయితే ఓటు వేయడానికి ఆసక్తి లేని కారణంగా.. తక్కువ పోలింగ్ శాతం నమోదైందనే వాదనలు ఉన్నప్పటికీ.. ఆబ్సెంట్, షిఫ్టెట్, డెడ్ లేదా డుప్లికేట్ ఓటర్లు కూడా ఉండే అకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. గత 14 ఏళ్లలో నగరం నుంచి చాలా మంది వేరే చోట్లకు వలస వెళ్లే అవకాశం ఉంది. లేదా విదేశాల్లో సెటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఎస్ఐఆర్లో వీరందరి ఓట్లు తొలగిస్తే.. మొత్తం ఓటర్లు భారీగా తగ్గిపోనున్నారని విశ్లేషకులు అంటున్నారు. కాగా, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు అభ్యంతరం తెలపనప్పటికీ.. ప్రతిపక్ష రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.