|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:14 PM
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ప్రారంభమైంది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జరగనున్న వనదేవతల జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక, పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. తెలంగాణ జాతరకు వెళ్లే భక్తుల కోసం టీజీఆర్టీసీ 4 వేల బస్సులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే జాతర నేపథ్యంలో మేడారం పరిసర ప్రాంతాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొబ్బరికాయ మొదలు అమ్మలకు సమర్పించే బంగారం (బెల్లం), కోళ్లు, మేకల ధరలతో పాటు, ఇళ్లు, ప్రత్యేక గదుల అద్దెలను భారీగా పెంచి భక్తులను దోచుకుంటున్నారు. ఆఖరికి చెట్టు నీడకు కూడా కిరాయి వసూలు చేస్తున్నారంటే జాతరలో దోపిడీ ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించవచ్చు.
మేడారం జాతరలో భాగంగా భక్తులు మొక్కులు చెల్లించుకోవడానికి బంగారం (బెల్లం)తో పాటు కోళ్లు, మేకలను సమర్పిస్తారు. ఇదే అదునుగా మేడారం జాతర వద్ద కోళ్లు, మేకల ధరలను భారీగా పెంచారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు వెంట తీసుకురాలేక, జాతరకు వచ్చాక అక్కడే కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలో వ్యాపారులు ధరలను రెట్టింపు చేశారు.
మేకపోతు లైవ్ కిలో రూ. 420 ఉండగా, మేడారంలో మాత్రం రూ. 900 నుంచి రూ. 1000 వరకు అమ్ముతున్నారు. మటన్ ధర రూ. 1500 వరకు పలుకుతోంది. బయట రూ. 170-180 కి దొరికే కిలో కోడిని జాతర దగ్గర రూ. 300-350 వరకు అమ్ముతున్నారు. మొన్నటి వరకు కూడా కిలో రూ. 350-400 ఉన్న నాటుకోడిని ఇప్పుడు రూ. 700లకు అమ్ముతున్నారు. జాతర చివరి మూడు రోజుల్లో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇళ్ల అద్దెలు కూడా భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. కనీస వసతి సౌకర్యాలు లేకపోయినా సరే అద్దెలు ఆకాశాన్నంటాయి. ఆఖరికి చెట్ల నీడలో సేదతీరడానికి కూడా అద్దెలు వసూలు చేస్తున్నారు. పిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు ఉండటానికి ఇళ్లు వెతుకుతుండటంతో స్థానికులు భారీ మొత్తంలో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఒక్క ఫ్యాన్ తప్ప మరే ఇతర సౌకర్యాలు లేని గదులకు కూడా రోజుకు రూ. 6 వేల వరకు వసూలు చేస్తున్నారు.
గదులు దొరకని వారు చెట్ల నీడలో సేదతీరడానికి ప్రయత్నిస్తుండగా, తోట యజమానులు వాటికి కూడా అద్దెలు వసూలు చేస్తున్నారు. జాతరకు దగ్గరలో తోటలున్న స్థానికులు భక్తులకు చెట్లను అద్దెకు ఇస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడానికి ఒక్కో చెట్టుకు రూ. 1000 చొప్పున వసూలు చేస్తున్నారు.