|
|
by Suryaa Desk | Wed, Jan 28, 2026, 07:03 PM
తెలంగాణలోని మేడారం మహాజాతరకు భక్తులు పోటెత్తారు. బుధవారం (జనవరి 28) నుంచి జాతర ప్రారంభం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో మేడారం జాతరలో విషాదం చోటుచేసుకుంది. జంపన్నవాగులో పడి ఒక భక్తుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుడు మంచిర్యాలకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అంతకుముందు, మేడారం జాతరకు ట్రాక్టర్లో వస్తున్న తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మృతులను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన కస్తూరి లక్ష్మి (45), కస్తూరి అక్షిత (21) తల్లీకూతుళ్లుగా గుర్తించారు. దాదాపు 18 మందికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్కు చెందిన తళ్లీకూతుళ్లు బొమ్మాపూర్ గ్రామానికి చెందిన తమ బంధువుల ఇంటికి వచ్చి.. అక్కడ నుంచి ట్రాక్టర్లో మేడారం జాతరకు బయలుదేరారు.
మేడారం వైపు ప్రయాణిస్తుండగా మహా ముత్తారం మండలం పెగడపల్లి పెద్దవాగు వద్ద ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో తల్లీకూతుళ్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం ట్రాక్టర్లో 20 మంది ప్రయాణిస్తుండగా.. మిగతా వారిని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి శ్రీధర్ బాబు.. మంథని పట్టణం నుంచి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వారిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు వారిని వరంగల్లోని ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అనతంరం ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాగా, జనవరి 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరుతారు. ఆ తర్వాత జనవరి 29న కీలక ఘట్టం జరుగుతుంది. చిలుకలగుట్ట నుంచి కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకువచ్చి.. గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, శివసత్తుల విన్యాసాలతో అడవి మారుమోగిపోతుంది. మురుసటి రోజు జనవరి 30న భక్తులు సమర్పించే నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కులతో గద్దెలు నిండిపోతాయి. కాగా, జనవరి 31న దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ఈ క్రమంలో ఈ రోజుల్లో పెద్ద సంఖ్యలో వనదేవలను దర్శించుకోవడానికి భక్తులు తరలివస్తారు. దీంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.