|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 07:48 PM
హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలతో పాటు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వాణిజ్య సముదాయాలపై హైడ్రా తన పంజా విసిరింది. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న భవనాలపై అధికారులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అగ్నిమాపక భద్రత పాటించని సంస్థలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ నేతృత్వంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
నగరంలోని సంపన్నుల ప్రాంతమైన జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 36లో ఉన్న ప్రముఖ వస్త్ర విక్రయ సంస్థ 'నీరూస్' షోరూంను అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అనుమతి పొందిన అంతస్తుల కంటే అదనంగా రూఫ్ షెడ్డు వేసి, దానిని గోదాముగా మార్చడాన్ని అధికారులు గుర్తించారు. భవనంలో మూడు సెల్లార్లు, నాలుగు అంతస్తులు ఉన్నాయి. అయితే.. పై అంతస్తులో భారీగా వస్త్రాలను నిల్వ ఉంచడం వల్ల ప్రమాద సమయంలో మంటలు ఆర్పడం అసాధ్యంగా మారుతుంది.
కనీస ఫైర్ ఎన్వోసీ లేకపోవడమే కాకుండా.. అందుబాటులో ఉన్న అగ్నిమాపక పరికరాలు పనికిరాకుండా పోయాయని అధికారులు నిర్ధారించారు. దీంతో ఈ షోరూంను 'అన్ సేఫ్'గా ప్రకటిస్తూ విద్యుత్ సరఫరా నిలిపివేసి, హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. గతంలో నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చాస్ ఫర్నీచర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం ఐదుగురి ప్రాణాలను బలితీసుకుంది. ఈ ఘటన జరిగిన తర్వాత కూడా వ్యాపారస్తుల్లో మార్పు రాకపోవడాన్ని కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. అదే ప్రాంతంలో ఉన్న రహీమ్, మన్నన్ ఎస్టేట్స్ స్టాండర్డ్ ఫర్నీచర్ దుకాణంలో అధికారులు సోదాలు చేశారు.
ఆరు అంతస్తుల ఈ భవనంలో మెట్ల మార్గాన్ని కూడా వదలకుండా ఫర్నీచర్ నింపేయడం చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగితే బయటకు వచ్చే మార్గం లేకపోవడం, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తుంగలో తొక్కడంతో వెంటనే ఈ భవనాన్ని సీజ్ చేశారు. నగరంలో ఎక్కడైనా వాణిజ్య సముదాయాలు నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నా.. సెల్లార్లను గోదాములుగా మార్చి ప్రమాదకర వస్తువులను నిల్వ ఉంచినా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. హైడ్రా కంట్రోల్ రూమ్ నంబర్ 9000113667, కమిషనర్ వాట్సాప్ నంబరు 7207923085 ద్వారా సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఫొటోలు, వీడియోలను 'Commissioner_HYDRAA' ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా కూడా పంపవచ్చని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు లాభాల కంటే పౌరుల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలని.. లేనిపక్షంలో లైసెన్సుల రద్దుతో పాటు కఠిన శిక్షలు తప్పవని హైడ్రా హెచ్చరించింది.