|
|
by Suryaa Desk | Thu, Jan 29, 2026, 09:19 PM
మున్సిపల్ ఎన్నికల విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆర్మూర్ జెడ్పీ మహిళా హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వనజా రెడ్డిపై వేటు పడింది. ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైనందుకు గాను ఆమెను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వనజా రెడ్డికి ఆర్మూర్లోని 4, 5, 6 వార్డులకు రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు అప్పగించారు.
ఎన్నికల వంటి అత్యంత కీలకమైన సమయంలో అధికారుల అనుమతి తీసుకోకుండా ఆమె విధులకు రాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్ఛార్జ్ కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ.. వనజా రెడ్డిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.
పండ్ల ఈగలు + బొద్దింకలు + దోమలు అన్నింటికీ కర్పూరం ఉంటే చాలు, ఇంట్లోకి వచ్చే పురుగులన్నీ మాయం, ఎలా వాడాలో తెలుసా?
మరోవైపు.. బాన్సువాడలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఇన్ఛార్జ్ కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఎన్నికల సంఘం నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్లను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. పోటీ చేసే అభ్యర్థి సదరు మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా ఓటరుగా ఉంటే సరిపోతుంది. అభ్యర్థిని ప్రతిపాదించే వారు మాత్రం కచ్చితంగా అదే వార్డు లేదా డివిజన్కు చెందిన ఓటరై ఉండాలి.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కమిషనర్లను ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ కమిషనర్లు ఈ పర్యవేక్షణలో పాల్గొన్నారు. ఎన్నికల విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వనజా రెడ్డిపై తీసుకున్న తరహాలోనే కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు.