|
|
by Suryaa Desk | Mon, Feb 02, 2026, 07:39 PM
‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ అవార్డు’ ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ అసక్తకర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప నాయకులను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని ఆయన అన్నారు. ఈ తరం నాయకులకు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి వారు స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ.. ‘2014 ఎన్నికల్లో జైపాల్ రెడ్డి గారు 2 వేల ఓట్ల తేడాతో ఓడిపోవడానికి నేనే కారణం. అయినప్పటికీ ఆయన నన్ను ఎప్పుడూ దూషించలేదు’ అని తన పాత జ్ఞాపకాలను సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.నాడు నిజాం పాలకుల అరాచకాలు, రాచరిక పోకడలకు వ్యతిరేకంగా రావి నారాయణ రెడ్డి సాగించిన పోరాటం అనన్యసామాన్యమని పేర్కొన్నారు. ఆయన తనకున్న 500 ఎకరాల సొంత భూమిని పేదలకు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. ప్రజల స్వేచ్ఛను హరించి, హక్కులకు భంగం కలిగిస్తే తిరుగుబాటు తప్పదని, ఆ ప్రజా పోరాటమే సాయుధ పోరాటంగా మారుతుందని ఆయన చాటిచెప్పారని సీఎం వివరించారు.అనంతరం అవార్డు గ్రహీత జస్టిస్ సుదర్శన్ రెడ్డి ‘భారత రాజ్యాంగం - భావప్రకటన స్వేచ్ఛ’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువల పరిరక్షణ ఎంత అవసరమో ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప రెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సీపీఐ నేతలు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.