|
|
by Suryaa Desk | Fri, Jan 23, 2026, 07:52 PM
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ డ్రామా 'లాక్డౌన్' విడుదలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏఆర్ జీవా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 30న థియేటర్లలో విడుదల కానుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ప్రతి విరామానికి ఒక అర్థం ఉంటుంది.. జనవరి 30న లాక్డౌన్ చిత్రం థియేటర్లలోకి వస్తోంది అంటూ చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా, చెన్నైతో పాటు తమిళనాడులోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు, 'దిత్వా' తుపాను ప్రభావం కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత డిసెంబర్ 12న విడుదల చేయాలని భావించినప్పటికీ, అనివార్య కారణాల వల్ల అది కూడా సాధ్యపడలేదు. ప్రేక్షకుల భద్రత తమకు ముఖ్యమని పేర్కొంటూ అప్పట్లో లైకా సంస్థ సినిమాను వాయిదా వేసింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో ఈ నెలాఖరున సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ 'అనిత' అనే పాత్రలో కనిపిస్తుంది. కరోనా లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఇబ్బందులు పడుతూ బయట అప్పుల కోసం ప్రయత్నించే ఓ యువతి కథగా ట్రైలర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చార్లీ, నిరోషా, లివింగ్స్టన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్ఆర్ రఘునందన్, సిద్ధార్థ్ విపిన్ సంగీతం అందించగా, ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఇప్పటికే 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసింది. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
Latest News