|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:10 PM
థ్రిల్లర్ టచ్ తో సాగే సినిమాలకు, సిరీస్ లకు ఓటీటీ వేదికపై చాలా క్రేజ్ ఉంది. ఈ తరహా కంటెంట్ తో వచ్చిన సిరీస్ లకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ కాన్సెప్ట్ లు ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. దాంతో ఓటీటీ సంస్థలు ఈ తరహా కంటెంట్ ను అందించడానికి పోటీ పడుతున్నాయి. అలా సూపర్ నేచురల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సిరీస్ గా, 'విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్' కనిపిస్తోంది. కృష్ణ పోలూరు ఈ సిరీస్ కి దర్శకత్వం వహించాడు. గతంలో 'రెక్కీ' సిరీస్ ను అందించిన నిర్మాతలే ఈ సిరీస్ ను నిర్మించారు. అభిజ్ఞ - చరణ్ లక్కరాజు ప్రధానమైన పాత్రలను పోషించారు. 'జీ5'వారు ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకు రానున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. 1980ల కాలంలో ఈ కథ నడుస్తుంది. 'విరాటపాలెం' ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలోని యువతులను పెళ్లి చేసుకోరు. పెళ్లి రోజునే పెళ్లి కూతురు చనిపోతూ ఉండటమే అందుకు కారణం. ఇలా జరగడాన్ని తమ గ్రామానికి గల శాపంగా వాళ్లు నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ కానిస్టేబుల్ అభిజ్ఞ ఆ ఊరు వస్తుంది. జరుగుతున్న సంఘటనలపై ఆమెకి అనుమానం కలుగుతుంది. దాంతో అసలు రహస్యాన్ని కనిపెట్టడానికి రంగంలోకి దిగుతుంది. ఆ ప్రయత్నంలో ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయనేది కథ.
Latest News