|
|
by Suryaa Desk | Thu, Jun 19, 2025, 08:09 PM
టాలీవుడ్ హీరో నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సమంత కలిసి నటించిన ఎవర్గ్రీన్ చిత్రం ‘ఏ మాయ చేసావె’. సుమారు 15 ఏళ్ల క్రితం విడుదలై సంచలన విజయం సాధించిన ఈ సినిమా వచ్చే నెల 18న మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సినిమా రీ-రిలీజ్ ప్రచార కార్యక్రమాల్లో సమంత, నాగచైతన్య కలిసి పాల్గొంటారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై సమంత తాజాగా స్పందించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఓ ఆంగ్ల వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు."చిత్రబృందంతో కలిసి నేను ఆ సినిమాను ప్రమోట్ చేయడం లేదు. నిజం చెప్పాలంటే ప్రమోషన్స్కు దూరంగా ఉంటున్నా. ఇలాంటి వార్తలు ఎవరు కల్పిస్తున్నారో నాకు తెలియడం లేదు" అని సమంత తెలిపారు. ప్రేక్షకుల దృష్టికోణంపై ఒకరి జీవితం ఆధారపడి ఉండదని ఆమె అభిప్రాయపడ్డారు.అనంతరం తన తొలి సినిమా రోజుల అనుభవాలను గుర్తుచేసుకుంటూ, "'మాస్కోవిన్ కావేరి' నా మొదటి సినిమా అయినా, 'ఏ మాయ చేసావె' షూటింగ్కు సంబంధించిన ప్రతి విషయం నాకు బాగా గుర్తుంది. జెస్సీ-కార్తీక్ల ఇంటి గేటు సీన్ నా తొలి షాట్. గౌతమ్ వాసుదేవ్ మేనన్ దర్శకత్వంలో పనిచేయడం అప్పట్లో ఎంతో సంతోషాన్నిచ్చింది" అని సమంత వివరించారు. నటిగానే కాకుండా, నిర్మాతగా కూడా సమంత ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తున్నారు.
Latest News