![]() |
![]() |
by Suryaa Desk | Thu, Jul 10, 2025, 09:31 AM
కన్నడ సినీ నటి రాన్యా రావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. గోల్డ్ స్మగ్లింగ్, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఆమెకు చెందిన రూ.34.12 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కర్ణాటకలోని బెంగళూరు, తుమకూరు జిల్లాల్లో ఉన్న ఈ ఆస్తులను మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం వెల్లడించింది. స్మగ్లింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతోనే ఈ ఆస్తులను కొనుగోలు చేసినట్టు దర్యాప్తులో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.ఈ ఏడాది మార్చి 3న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాన్యా రావు 14.213 కిలోల బంగారంతో పట్టుబడటంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె వద్ద ఉన్న బంగారం విలువ రూ.12.56 కోట్లుగా గుర్తించారు. అంతకుముందే, ముంబై విమానాశ్రయంలో ఇద్దరు విదేశీయుల నుంచి డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు 21.28 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఆధారంగా సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్తో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.దుబాయ్, ఉగాండా వంటి దేశాల నుంచి స్మగ్లింగ్ సిండికేట్ బంగారం తరలిస్తున్నట్టు ఈడీ విచారణలో బయటపడింది. రాన్యా రావు తన సహచరుడు తరుణ్ కొండూరు రాజు, మరికొందరితో కలిసి ఈ దందాను నడిపినట్టు తేలింది. హవాలా మార్గంలో డబ్బు చెల్లించి, నకిలీ పత్రాలతో బంగారాన్ని భారత్కు తరలించేవారని అధికారులు గుర్తించారు. ఇక్కడ ఆ బంగారాన్ని అమ్మి, ఆ డబ్బును మళ్లీ హవాలా ద్వారా స్మగ్లింగ్ కోసం ఉపయోగించేవారని దర్యాప్తులో తేలింది.ఈ కేసులో మొత్తం రూ.55.62 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఈడీ లెక్క తేల్చింది. అయితే, విచారణలో రాన్యా రావు తన ప్రమేయాన్ని నిరాకరించినప్పటికీ, స్వాధీనం చేసుకున్న డిజిటల్ ఆధారాలు, పత్రాలు ఆమె వాదనను తోసిపుచ్చాయని అధికారులు తెలిపారు. ఈ స్మగ్లింగ్కు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగులపై కూడా నిఘా పెట్టినట్టు, కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ స్పష్టం చేసింది.
Latest News