|
|
by Suryaa Desk | Thu, Jul 03, 2025, 03:52 PM
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మలయాళ చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. అత్యాచార బాధితురాలి నేపథ్యంలో సాగే ఈ కథకు ‘జానకి’ అనే పేరు పెట్టడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డ్) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తూ టైటిల్ను మార్చాలని చెప్పడంతో చర్చనీయాంశంగా మారింది.ఈ వివాదంపై చిత్ర దర్శకుడు ప్రవీణ్ నారాయణన్ స్పందించారు. "జానకి అనేది సీతాదేవి పేరే అయినప్పటికీ, అది ఎంతోమందికి ఉండే ఒక సాధారణమైన పేరు. మా సినిమాలో ఎక్కడా సీతాదేవిని కించపరచలేదు, ఎవరి మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు లేవు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్న ఈ సమయంలో పేరు మార్చడం చాలా కష్టం" అని ఆయన తెలిపారు. సెన్సార్ బోర్డ్ తన దృక్కోణాన్ని మార్చుకోవాలని ఆయన కోరారు.మరోవైపు, మలయాళ నటీనటుల సంఘం కూడా ఈ విషయంలో చిత్ర యూనిట్కు మద్దతుగా నిలిచింది. సెన్సార్ బోర్డు తీరు హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. సినిమాలో ఎన్నో సంభాషణల్లో ఆ పేరును వాడినప్పుడు, ఇప్పుడు టైటిల్ మార్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది.థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో అనుపమ జానకి పాత్రలో నటిస్తుండగా, ప్రముఖ నటుడు సురేశ్ గోపి లాయర్గా కీలక పాత్ర పోషించారు. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీలో జాప్యం చేయడంతో, చిత్ర నిర్మాతలు ఇప్పటికే కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. "సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుంది" అనేది ఈ సినిమా ఉపశీర్షిక.
Latest News