![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:27 PM
థ్రిల్లర్ జోనర్లో మలయాళంలో రూపొందిన సినిమానే 'పెండ్యులం'. లూసిడ్ డ్రీమింగ్ - టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి రెజీనా బాబు దర్శకత్వం వహించాడు. విజయ్ బాబు - అనుమోల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 16వ తేదీన 2023లో విడుదలైంది. ఈ సినిమా ఇప్పుడు ఈటీవీ విన్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఒకసారి పరిశీలన చేద్దాం.
కథ: మహేశ్ నారాయణన్ ( విజయ్ బాబు) ఆయన భార్య శ్వేత .. కూతురు తన్మయి కలిసి ఆస్ట్రేలియా నుంచి ఇండియా వచ్చేస్తారు. మహేశ్ డాక్టర్ కావడంతో, అతను హాస్పిటల్ కి వెళ్లి వస్తూ ఉంటాడు. ఒక రోజున అతను భార్యా పిల్లలతో కలిసి సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళతాడు. ఒక ప్రదేశానికి వెళ్లిన తరువాత, గతంలో ఆ ప్రదేశంతో తనకి సంబంధం ఉన్నట్టుగా మహేశ్ కి అనిపిస్తుంది. దాంతో అతను గుర్తుచేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన్మయి చేసిన పొరపాటు కారణంగా డిక్కీలో కార్ కేస్ ఉండిపోవడంతో, ఆ రాత్రి వాళ్లంతా అక్కడే ఉండిపోవలసి వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే మహేశ్ రోడ్డుపక్కన పొదల్లో స్పృహలేకుండా పడిఉంటాడు. రాత్రి తనని ఓ లారీ ఢీ కొట్టిందని శ్వేతతో మహేశ్ చెబుతాడు. ఆ మాటలను ఆమె నమ్మలేకపోతుంది. ఆ లారీ నెంబర్ కూడా తాను చూశానని మహేశ్ చెబుతాడు. ఆ తరువాత అందుకు సంబంధించిన విచారణ చేస్తే, 15 ఏళ్ల క్రితమే ఆ లారీని డిస్పోజ్ చేశారని తెలిసి షాక్ అవుతాడు.కొన్ని ప్రదేశాలు ఇంతకుముందే చూసినట్టుగా ఎందుకు అనిపిస్తున్నాయి? 15 ఏళ్ల క్రితమే డిస్పోజ్ చేయబడిన లారీ, తనని ఎలా ఢీకొట్టింది? అనే విషయం మహేశ్ కి అర్థం కాదు. ఇలాంటి విషయంలో మంచి అనుభవం ఉన్న జాన్ మాస్టర్ ను కలుస్తాడు. వేరేవారి కలలోకి అతను వెళ్లడం వలన ఈ సమస్య తలెత్తిందని జాన్ మాస్టర్ చెబుతాడు. ఆ కల కన్నది ఎవరనే విషయం తెలిస్తే పరిష్కారం లభిస్తుందని చెబుతాడు. అప్పుడు మహేశ్ ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది కథ.
Latest News