|
|
by Suryaa Desk | Fri, Feb 27, 2026, 03:01 PM
కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన తెలుగు సిరీస్ 'D/0 ప్రసాద్ రావు కనబడుటలేదు', ఈ రోజు నుంచి 'జీ 5' లో స్ట్రీమింగ్ అవుతోంది. రాజీవ్ కనకాల .. ఉదయభాను .. వసంతిక .. గాయత్రి భార్గవి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా రూపొందించారు. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
ప్రసాద్ రావు (రాజీవ్ కనకాల) సూళ్లూరుపేటలో ఒక కిరాణా షాపు నడుపుతూ ఉంటాడు. భార్య .. కూతురు స్వాతి (వసంతిక) ఇదే అతని ఫ్యామిలీ. ప్రసాద్ రావు తమ్ముడు .. బావ ఇద్దరూ కూడా తమ కుటుంబాలతో కలిసి అక్కడికి దగ్గరలోనే ఉంటూ ఉంటారు. స్వాతి అంటే ప్రసాద్ రావుకి ప్రాణం. ఇంజనీరింగ్ పూర్తికావడంతో, ఆమెకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని ఆయన నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో స్వాతికి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ సంస్థలో జాబ్ వస్తుంది. ప్రసాద్ రావుకి ఇష్టం లేకపోయినా, కుటుంబ సభ్యులంతా కలిసి ఒత్తిడి చేయడంతో కాదనలేకపోతాడు. హైదరాబాద్ తీసుకుని వెళ్లి, ఆఫీస్ .. హాస్టల్ చూసి దిగబెట్టేసి వస్తాడు. స్వాతి అక్కడ ఉమెన్స్ వర్కింగ్ హాస్టల్లో దిగుతుంది. హాస్టల్ రూములో అప్పటికే మంజు - రమ్య - శాండీ ఉంటారు. ఆ రూమ్ లో తాము తప్ప మరొకరు ఉండటానికి వాళ్లు ఎంతమాత్రం ఇష్టపడరు. వాళ్ల ధోరణి స్వాతికి చాలా ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. హాస్టల్ నిర్వాహకురాలు భవాని ( గాయత్రి భార్గవి)కి చెప్పినా ఆమె పెద్దగా పట్టించుకోదు.అలా నెల గడిచిపోతుంది. ఓ రోజు రాత్రి స్వాతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ప్రసాద్ రావు వర్షంలోనే బయల్దేరి హైదరాబాద్ లోని హాస్టల్ కి చేరుకుంటాడు. అప్పటికే స్వాతి మిస్సింగ్ గురించి పోలీస్ ఆఫీసర్ రెబెక్కా (ఉదయాభాను)తో భవాని మాట్లాడుతూ ఉంటుంది. తన కూతురు కనిపించకుండా పోయిందని తెలుసుకున్న ప్రసాద్ రావు ఏం చేస్తాడు? ఆమె కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? ఈ విషయంలో ప్రసాద్ రావుకి తెలిసే చేదు నిజాలేమిటి? అనేది మిగతా కథ.
Latest News