|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 12:54 PM
లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సరిగమ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు, ఫిబ్రవరి 13, 2026న జస్టిస్ తుషార్ రావు గెడెలా ఉత్తర్వుల ప్రకారం, సరిగమ సంస్థకు హక్కులు ఉన్న 134 సినిమాలకు సంబంధించిన పాటలు, సౌండ్ రికార్డింగ్లను ఇళయరాజా వాడకూడదని, వాటిని ఇతరులకు లైసెన్స్ ఇవ్వకూడదని మధ్యంతర స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పాటలపై తనకు యాజమాన్య హక్కులు ఉన్నాయని ఇళయరాజా క్లెయిమ్ చేయకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఏప్రిల్లో జరగనుంది.ఈ సినిమాల పాటలను ఇటీవల ఇళయరాజా తన పేరుతో అమెజాన్ మ్యూజిక్, ఐట్యూన్స్, జియోసావన్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్లలో అప్లోడ్ చేసి, ఇతరులకు లైసెన్స్ ఇస్తున్నారని సరిగమా కోర్టును ఆశ్రయించింది. దీంతో న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. 1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా బాణీలు అందించిన 134 చిత్రాలకు సంబంధించిన ఆడియో హక్కులు సదరు సంస్థకే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వత ప్రాతిపదికన సరిగమకు విక్రయించిన నేపథ్యంలో, ఇప్పుడు వాటిపై ఇళయరాజాకు ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవని జస్టిస్ తుషార్ రావు గెడేలా వెల్లడించారు.
Latest News