|
|
by Suryaa Desk | Sun, Sep 07, 2025, 08:12 PM
ప్రముఖ మోడల్, నటుడు, ఫిట్నెస్ ఐకాన్ మిలింద్ సోమన్.. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పెద్ద అభిమానినని, ముఖ్యంగా ఫిట్నెస్ పట్ల ఆయనకున్న నిబద్ధతను ఎంతగానో ఆరాధిస్తానని అన్నారు. ప్రధాని మోదీ 75వ పుట్టినరోజు వేడుకల సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తలపెట్టిన 'నమో యువ రన్' ప్రచార కార్యక్రమాన్ని ఆయన ఆదివారం ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మిలింద్ సోమన్ మాట్లాడుతూ, "ఫిట్నెస్ అంటే కేవలం కండలు పెంచడం, సిక్స్ ప్యాక్ చేయడం మాత్రమే కాదు. జీవితంలోని ఒత్తిళ్ల మధ్య కూడా చురుగ్గా ఉంటూ, చేయాల్సిన పనులను సక్రమంగా చేయగలగడమే నిజమైన ఫిట్నెస్" అని వివరించారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది యువతతో ఏకకాలంలో పరుగు నిర్వహించడం ఒక అద్భుతమైన కార్యక్రమమని ఆయన ప్రశంసించారు. "భారత్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున ఒకేసారి రన్ నిర్వహించడం బహుశా ఇదే మొదటిసారి. మార్పు రావాలంటే నిరంతర సాధన ముఖ్యం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి" అని ఆయన ఆకాంక్షించారు. ఈ పరుగు డ్రగ్స్కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటంలో యువతను భాగస్వాములను చేస్తుందని సోమన్ పేర్కొన్నారు.
Latest News