|
|
by Suryaa Desk | Sun, May 25, 2025, 07:36 PM
ప్రముఖ నటుడు ముకుల్ దేవ్ (54) ఆకస్మిక మరణం పట్ల ఆయన సహనటుడు విందూ దారా సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. త్వరలో విడుదల కానున్న 'సన్ ఆఫ్ సర్దార్ 2' చిత్రంలో ముకుల్ దేవ్తో కలిసి పనిచేసిన విందూ, ఆయనతో తనకున్న అనుబంధాన్ని, కొన్ని వ్యక్తిగత విషయాలను ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ పంచుకున్నారు. "ముకుల్ మనల్ని విడిచివెళ్లినా, మన అందరి హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు," అని విందూ భావోద్వేగంతో అన్నారు.'సన్ ఆఫ్ సర్దార్ 2' చిత్రీకరణ సమయంలో ముకుల్ దేవ్ బాగా బరువు పెరిగారని, అయితే అజయ్ దేవగన్ సహాయంతో వ్యాయామాలు చేసి బరువు తగ్గాడని విందూ గుర్తుచేసుకున్నారు. "సన్ ఆఫ్ సర్దార్ 2లో ఆయన అద్భుతంగా నటించారు. గత ఏడాది ఆగస్టులో స్కాట్లాండ్లో నెల రోజుల పాటు మేమంతా కలిసి షూటింగ్ చేశాం. అప్పుడు ముకుల్ కొంచెం బరువు పెరిగారు. దాంతో అజయ్ దేవగన్ ఆయనకు వ్యాయామంలో సాయం చేశారు. దానివల్ల ఆయన మళ్లీ ఫిట్గా మారారు. కానీ, షూటింగ్ ముగించుకుని తిరిగి వచ్చాక మళ్లీ బరువు పెరిగారు. ఆయన చాలా మంచి మనసున్న వ్యక్తి," అని విందూ తెలిపారు.విజయ్ కుమార్ అరోరా దర్శకత్వం వహించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' చిత్రంలో అజయ్ దేవగన్, సంజయ్ దత్, మృణాల్ ఠాకూర్, సంజయ్ మిశ్రా, రవి కిషన్, కుబ్రా సైత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్పాండే, ఎన్.ఆర్. పచిసియా, ప్రవీణ్ తల్రేజా, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2012లో అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా జంటగా వచ్చిన 'సన్ ఆఫ్ సర్దార్' చిత్రానికి ఇది కొనసాగింపుగా కాకుండా, అదే స్ఫూర్తితో వస్తున్న చిత్రం. ఈ సినిమా జులై 25న థియేటర్లలో విడుదల కానుంది.ముకుల్ దేవ్ శుక్రవారం రాత్రి తన 54వ ఏట తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన మరణానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆయన అంత్యక్రియలు శనివారం ఢిల్లీలోని నిజాముద్దీన్ వెస్ట్లో ఉన్న దయానంద్ ముక్తి ధామ్లో జరిగాయి.
Latest News