![]() |
![]() |
by Suryaa Desk | Sat, May 24, 2025, 06:20 PM
'అసెంబ్లీ రౌడీ' సినిమా తరువాత తెలుగు తెరపై కొంతకాలం పాటు సందడి చేసిన హాస్యనటి పాకీజా. ఆ తరువాత చాలా కాలం పాటు కనిపించకుండా పోయిన పాకీజా, ఆ మధ్య ఒక యూ ట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో కనిపించారు. తన ఆర్ధిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని ఆమె ఆ సందర్భంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ వారితో పాటు మరికొంతమంది సహాయాన్ని అందించారు. బయట నుంచి ఆమెకి సహాయం అందే ఏర్పాటు కూడా చేశారు. అయితే తాజాగా పాకీజా మరో యూట్యూబ్ ఛానల్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరిస్థితిని గురించి ప్రస్తావించారు. "నేను తినడానికి తిండి కూడా లేకుండా రోడ్లపై తిరుగుతూ ఉంటే, ఒక ఛానల్ వారు నాకు సహాయం చేశారు. నా పరిస్థితి చెప్పి సహాయం అందేలా చేశారు. నాగబాబుగారు .. రవితేజ తల్లిగారు .. ఇలా కొంతమంది నాకు సహాయం చేశారు. అయినా నేను అప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నానో .. ఇప్పుడూ అదే పరిస్థితిలో ఉన్నాను" అని చెప్పారు. " ఆ ఛానల్ లో నా కష్టం చెప్పుకున్న తరువాత నాకు అందిన సాయం 5 లక్షల లోపే. తెలుగు రాష్ట్రాల వారు 100 మొదలు 500 వరకూ డబ్బులు పంపిస్తున్నారు. అయితే మొదట నా ఇంటర్వ్యూ తీసుకున్నవారు, నాకు 15 లక్షల సాయం అందినట్టు చెప్పారు. దాంతో ఆ డబ్బు దాచుకుని మళ్లీ నేను బిక్షాటన చేస్తున్నాననే సంకేతాలు జనంలోకి వెళ్లాయి. ఇకపై నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వొద్దనే కామెంట్లు కనిపిస్తున్నాయి. ఆకు వేసి పిలిచి .. మంచి భోజనం పెట్టి .. చివరికి అందులో మట్టిపోసినట్టు చేశారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Latest News