|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 09:37 PM
నటుడు మంచు మనోజ్ ఆదివారం పవిత్ర పుణ్యక్షేత్రమైన అయోధ్యలో అడుగుపెట్టారు. ఇటీవల విడుదలైన తన చిత్రం 'మిరాయ్' సక్సెస్ టూర్ను ఆయన ఇక్కడి నుంచే ప్రారంభించడం విశేషం. చిన్నప్పటి నుంచి అయోధ్యను సందర్శించాలని ఎంతో ఆశపడ్డానని, ఇన్నాళ్లకు ఆ కల నెరవేరడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.విమానాశ్రయం నుంచి నేరుగా హనుమాన్ గఢీ ఆలయానికి, సరయూ నది తీరానికి వెళ్లి మనోజ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "మిరాయ్ సక్సెస్ టూర్ను అయోధ్య నుంచి ప్రారంభించాలని ఇక్కడికి వచ్చాను. చిన్ననాటి నుంచి అయోధ్యకు రావాలనేది నా కల. చివరకు ఇక్కడికి రావడం ఎంతో ఆనందాన్నిచ్చింది" అని అన్నారు. రాముడిని దర్శించుకున్న తర్వాత లక్నో నుంచి ముంబై వరకు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా, విదేశాల్లోనూ ఈ టూర్ కొనసాగుతుందని ఆయన వివరించారు.కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన 'మిరాయ్' చిత్రంలో మంచు మనోజ్ 'మహావీర్ లామా' అనే కీలక పాత్రలో నటించారు. పవిత్ర గ్రంథాలను కాపాడేందుకు ఓ యోధుడు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో తేజ సజ్జ కథానాయకుడిగా నటించగా, ఆయన తల్లి పాత్రలో శ్రియ శరణ్, కథానాయికగా రితికా నాయక్ కనిపించారు. జగపతి బాబు, జయరాం ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.
Latest News