|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 04:57 PM
భారత చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తనను వరించిందని తెలిసినప్పుడు ఆ వార్తను నమ్మలేకపోయానని, అది కలో నిజమో అనిపించిందని మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ అన్నారు. 2023 సంవత్సరానికి గాను ఆయన్ను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఈ విషయం తెలియజేయడానికి ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) నుంచి నేరుగా ఫోన్ రావడం తనను ఆశ్చర్యంలో ముంచెత్తిందని ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. మలయాళ చిత్ర పరిశ్రమకు దక్కిన మొట్టమొదటి ఫాల్కే అవార్డు ఇదే కావడం విశేషం.ఆదివారం కొచ్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోహన్లాల్ మాట్లాడుతూ, ఆ అనూహ్య క్షణాలను గుర్తుచేసుకున్నారు. "పీఎంఓ నుంచి నాకు ఫోన్ వచ్చింది. వారు విషయం చెప్పగానే నేను ఆశ్చర్యపోయాను. ఇది నిజమేనా అని మరోసారి చెప్పమని అడిగాను. ఆ సమయంలో నేను కలలో ఉన్నానేమో అనిపించింది" అంటూ తన అనుభూతిని పంచుకున్నారు. నాలుగు దశాబ్దాలుగా పరిశ్రమలో కొనసాగుతున్నానని, సినిమాను తప్ప మరే పెద్ద కలలు కనలేదని ఆయన తెలిపారు. "నిజాయతీగా పనిచేయడం, దేవుడి ఆశీస్సులతో పాటు అభిమానుల ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చాయి. ఈ పురస్కారం నా ఒక్కడిది కాదు, మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమది, నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరిది" అని ఆయన భావోద్వేగంగా పేర్కొన్నారు.
Latest News