|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:53 PM
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సీరియస్ అయ్యింది. పోలీసులు ఇచ్చిన నివేదికపై ఎన్హెచ్ఆర్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ (సీఎస్)కి మానవ హక్కుల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా, ఆమె కుమారుడు తీవ్రంగా పడ్డారు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదును పరిశీలించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్.. థియేటర్ వద్ద తగిన భద్రతా చర్యలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందించేలా ఆదేశాలు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
''సినిమా ప్రీమియర్ షోకి పోలీసుల అనుమతి లేదని రిపోర్టులో తెలిపారు. పర్మిషన్ లేకుంటే నటుడు, అభిమానులు ఎందుకు వచ్చారో తెలియడం లేదు. ముందే తగిన చర్యలు తీసుకొని ఉంటే ఈ ఘటన జరిగేది కాదు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి 6 వారాల్లోగా మరో నివేదిక అందజేయాలి'' అని సీఎస్ను ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని తెలంగాణ పోలీసులకు సూచించింది.