|
|
by Suryaa Desk | Wed, Aug 06, 2025, 07:47 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘బీసీ బిల్లును కేంద్రం ఆమోదించకపోతే మోదీని గద్దె దించుతాం’ అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను పార్లమెంట్లో చర్చించి వెంటనే ఆమోదించాలని రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘నాలుగు నెలలుగా ఈ బిల్లులు కేంద్రం, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లోనే ఉన్నాయి. రాష్ట్రపతిని అపాయింట్మెంట్ అడిగినా.. ఇప్పటి వరకు సమయం ఇవ్వలేదు’ అని ఆయన విమర్శించారు. ఈ పోరాటం రాహుల్ గాంధీ ఆలోచనల మేరకు జరుగుతోందని స్పష్టం చేశారు.
జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా..
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటంలో భాగంగా.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నది బీజేపీ నాయకులు కాదని, ప్రధాన శత్రువు ప్రధాని నరేంద్ర మోడీయేనని ఆరోపించారు. ‘మోదీ మెడలు వంచైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తాం’ అని ఆయన శపథం చేశారు. గుజరాత్ నుంచి గుంట భూమి కూడా అడగటం లేదని, తెలంగాణ ప్రజలకు మేలు చేసుకుంటుంటే కేంద్ర ప్రభుత్వానికి కడుపు మంట ఎందుకని ఆయన ప్రశ్నించారు. ‘మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేక రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి సాధించుకోవాలా?’ అని మోదీకి సవాల్ విసిరారు.
ఈ మహాధర్నాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి .. బీఆర్ఎస్ , బీజేపీ నాయకులపైనా విమర్శలు చేశారు. తమ ధర్నాను కేటీఆర్ 'డ్రామా' అనడంపై ఘాటుగా స్పందించారు. ‘కేటీఆర్ పేరులోనే డ్రామా ఉంది.. అంటూ ఎద్దేవా చేశారు. మోదీతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కూడా బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందా..? అని ప్రశ్నిస్తూ.. ఈ ధర్నాకు వారు ఎందుకు రాలేదని నిలదీశారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాతే కులగణన చేపట్టి.. చరిత్ర సృష్టించామని, ఇది దేశానికి ఒక రోల్ మోడల్ అవుతుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో రాహుల్ గాంధీ నేతృత్వంలో బీజేపీని గద్దె దించుతామన్నారు.