|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 08:48 PM
సరోగసీ పేరుతో మానవ అక్రమ రవాణాకు పాల్పడిన సికింద్రాబాద్ 'సృష్టి' ఫర్టిలిటీ సెంటర్ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని అన్ని ఫర్టిలిటీ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ తనిఖీలను పర్యవేక్షించడానికి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలో 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించి, నిబంధనలను పరిశీలించనున్నాయి.
తెలంగాణలో మొత్తం 381 ఐవీఎఫ్ (IVF) సెంటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలోనే 157 సెంటర్లు ఉన్నాయి. ముందుగా జీహెచ్ఎంసీ పరిధిలో మూడు రోజుల పాటు తనిఖీలు చేపట్టనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి జిల్లాల వారీగా మిగిలిన సెంటర్లను తనిఖీ చేస్తారు. ఈ తనిఖీల కోసం 29 అంశాలతో కూడిన ప్రత్యేక చెక్లిస్ట్ను రూపొందించారు. ఫర్టిలిటీ సెంటర్ల లైసెన్సులు, రికార్డులు, వైద్య విధానాలు, సరోగసీ నిబంధనల అమలు వంటి అంశాలను ఈ బృందాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. తనిఖీల అనంతరం మూడు రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషనర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
'సృష్టి' ఫర్టిలిటీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నమ్రతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పోలీసులు నమ్రతను సుమారు 3-4 గంటల పాటు డీసీపీ పర్యవేక్షణలో విచారించారు. మొదట సమాధానం చెప్పడానికి మొండికేసిన ఆమె, ఆ తర్వాత తనకేం తెలియదు, అంతా సక్రమంగానే ఉంది అంటూ పొడిపొడిగా సమాధానాలు ఇచ్చారు. హైదరాబాద్లోని రోగులకు సంబంధించిన రికార్డులు మాయం చేయడంపై పోలీసులు ప్రశ్నించగా.. ఆచితూచి స్పందించినట్లు తెలిసింది. తన పేరు మీద క్లినిక్ నిర్వహించడం లేదని, వైద్యవృత్తిలో నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానని నమ్రత వాదించారు.
మొదటి రోజు విచారణ అనంతరం నమ్రతకు వైద్య పరీక్షలు నిర్వహించి, మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆమెను నేడు మరోసారి విచారించనున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో, ఇలాంటి అక్రమాలకు పాల్పడే ఇతర సెంటర్లపైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.