|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 07:33 PM
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ.. భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 21 లోపు కేసు నమోదు చేసి.. నోటీసులు జారీ చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.
కొద్ది రోజుల క్రితం మంత్రి కొండా సురేఖ, ఫోన్ ట్యాపింగ్ కేసు, డ్రగ్స్ వ్యవహారం, నటి సమంత విడాకుల వివాదం వంటి సున్నితమైన అంశాలలో కేటీఆర్పై తీవ్రమైన, నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపాయి. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని భావించిన కేటీఆర్, కొండా సురేఖపై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశారు.
కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను BNS సెక్షన్ 356 కింద పరిగణనలోకి తీసుకున్న నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు, కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా.. ఈ నెల 21వ తేదీలోపు నోటీసులు జారీ చేయాలని కూడా సూచించింది. ఈ కేసు విచారణ సందర్భంగా.. మంత్రి కొండా సురేఖ తరపు న్యాయవాదులు కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ఫిర్యాదు ఊహాగానాల ఆధారంగా ఉందని, సరైన సమాచారం లేదని.. అలాగే ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి వంటి అంశాలపై అభ్యంతరాలు లేవనెత్తారు. అయితే.. కోర్టు ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది.
కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ పోగుల, కొండా సురేఖ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని బలంగా వాదించారు. ఈ వాదనలతో కోర్టు ఏకీభవించి.. కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని తేల్చి చెప్పింది. ఈ తీర్పు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. రాజకీయ నాయకులు పరువు నష్టం దావాలను ఎదుర్కోవడం కొత్తేమీ కానప్పటికీ.. క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించడం అరుదైన పరిణామంగా చెప్పుకోవచ్చు. దీనిపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. కోర్టు ఆదేశాలపై తనకు ఇంకా ఎలాంటి సమాచారం అందలేదని.. నోటీసులు అందిన తర్వాత స్పందిస్తానని కొండా సురేఖ వెల్లడించారు.