![]() |
![]() |
by Suryaa Desk | Thu, May 22, 2025, 07:49 PM
ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా మరోసారి సత్తా చాటింది. నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించిన 'హోమ్బౌండ్' చిత్రం ప్రతిష్ఠాత్మక 'అన్ సర్టెన్ రిగార్డ్' విభాగంలో ప్రదర్శితమైంది. ఈ సినిమాకు అంతర్జాతీయ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రదర్శన ముగిసిన అనంతరం ఏకంగా 9 నిమిషాల పాటు ప్రేక్షకులు లేచి నిలబడి చప్పట్లతో (స్టాండింగ్ ఒవేషన్) చిత్ర యూనిట్ను అభినందించారు. ఈ అపూర్వ ఆదరణతో చిత్ర బృందం యావత్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది.ప్రేక్షకుల నుంచి వస్తున్న నిరంతర చప్పట్లతో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా నటుడు ఇషాన్ ఖట్టర్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, తోటి నటుడు విశాల్ జెత్వాను ఆలింగనం చేసుకున్నారు. దర్శకుడు నీరజ్ ఘైవాన్ కూడా ఈ సంతోషంలో పాలుపంచుకున్నారు. అనంతరం వారు నటి జాన్వీ కపూర్ను ఆప్యాయంగా హత్తుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడి వాతావరణాన్ని మరింత ఉద్విగ్నభరితంగా మార్చాయి. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కూడా ప్రేక్షకుల్లో ఉండి, సినిమాకు లభించిన స్పందన చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. జాన్వీ సోదరి ఖుషీ కపూర్, ఆమె స్నేహితుడు శిఖర్ పహారియా కూడా ఈ వేడుకలో పాల్గొని, చప్పట్లతో తమ మద్దతు తెలిపారు. ఆడిటోరియంలో "శభాష్" అనే ప్రశంసలు మార్మోగాయి. 2025 కేన్స్ ఫెస్టివల్లో ప్రదర్శనకు ఎంపికైన ఏకైక భారతీయ ఫీచర్ ఫిల్మ్ 'హోమ్బౌండ్' కావడం విశేషం.
Latest News