|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 07:35 PM
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రేపు ప్రధాని మోదీ 75వ జన్మదినం సందర్భంగా, 2014లో ఆయనతో జరిగిన తొలి సమావేశంలోని మధుర జ్ఞాపకాలను నాగార్జున సామాజిక మాధ్యమ వేదికగా పంచుకున్నారు. ఆ భేటీలో మోదీ తనకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక అమూల్యమైన సలహా ఇచ్చారని వెల్లడించారు.ఈ విషయమై నాగార్జున ఒక వీడియోను విడుదల చేశారు. 2014లో గాంధీనగర్లో తొలిసారి మోదీని కలిశానని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమావేశంలో మోదీ తనతో మాట్లాడుతూ, "నా స్నేహితుల పిల్లలు మిమ్మల్ని ఫోటో అడిగినప్పుడు, మీరు ఎంతో ఆప్యాయంగా దగ్గరకు పిలిచి ఫోటో దిగారని వాళ్లు నాతో చెప్పారు. మీ చుట్టూ భద్రత ఉన్నా మీరు అలా చేయడం వాళ్లకు బాగా నచ్చింది" అని అన్నారని నాగార్జున గుర్తు చేసుకున్నారు.ఈ సంఘటనను ప్రస్తావిస్తూ మోదీ, "మీలో ఉన్న ఆ వినయాన్ని, సహానుభూతిని ఎప్పటికీ వదులుకోవద్దు. మనిషికి అవి చాలా ముఖ్యం" అని తనకు సలహా ఇచ్చారని నాగార్జున పేర్కొన్నారు. ఆ చిన్న విషయాన్ని కూడా మోదీ గుర్తుపెట్టుకుని చెప్పడంతో తాను ఆశ్చర్యపోయానని అన్నారు.తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ప్రధాని 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయనను స్మరించుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నాగార్జున తెలిపారు. దేశం కోసం మోదీ తన వ్యక్తిగత జీవితాన్ని, ఎన్నో కోరికలను త్యాగం చేశారని నాగార్జున ప్రశంసించారు.ప్రధాని మోదీకి ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, "సర్, మీరు ఆరోగ్యంగా ఉండాలి. భారతదేశానికి మీరు మళ్లీ కావాలి, దేశానికి మీ అవసరం ఉంది" అని నాగార్జున తన వీడియోలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Latest News