|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 07:16 PM
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె తన రాజకీయ భవిష్యత్తు, బీఆర్ఎస్ అవినీతి, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా.. ‘నాకు కూడా టైం వస్తుంది, నేను కూడా ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాను’ అంటూ కవిత ధీమా వ్యక్తం చేశారు.
సీఎం అయితే విచారణ..
తాను ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తానో కవిత స్పష్టం చేశారు. దేవుడి దయతో సీఎం అయితే.. 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్ని అన్యాయాలు, తప్పిదాలు, అవినీతి వ్యవహారాలపై తప్పకుండా విచారణ చేయిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు చూస్తున్నది నేను వేసిన 'టాస్' మాత్రమేనని.. వారి అవినీతి, అక్రమాలపై అసలు 'టెస్ట్ మ్యాచ్' త్వరలో ఉండబోతోందని కవిత హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల అవినీతిని తనపై రుద్దే ప్రయత్నం చేయొద్దని.. తమ పాలనలో తాను, తన భర్త ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదని ఆమె స్పష్టం చేశారు.
హిల్ట్ పాలసీకి కిటికీలు తెరిచింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారాలు తెరుస్తోందని ఆమె విమర్శించారు. కేసీఆర్ హయాంలో కేటీఆర్ ఉస్మాన్ కుంట చెరువును ప్రణీత్ బిల్డర్స్ కు డెవలప్మెంట్ కోసం ఇచ్చారని.. అందులో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు డైరెక్టర్గా ఉన్నారని ఆరోపించారు. 10 ఎకరాల చెరువు 6 ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాను దృష్టి పెట్టాలని కోరారు.
ఏవీ రెడ్డితో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డికి భూ లావాదేవీలు ఉన్నాయని.. శ్రీనివాస్రెడ్డి ప్రతి రోజూ కేటీఆర్ వద్ద ఉంటారని.. ఆయన ఎవరి బినామీనో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేతలకు కవిత చట్టపరమైన హెచ్చరికలు జారీ చేశారు. తనపై ఆరోపణలు చేసిన మాధవరం కృష్ణారావు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి లకు లీగల్ నోటీసులు పంపుతున్నానని.. వారు వారం రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే కోర్టుకు ఈడుస్తానని వార్నింగ్ ఇచ్చారు.
‘ఒకొక్కడి తోలు తీస్తా’..
తనపై విష ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని.. తప్పుడు ఆరోపణలు చేస్తే ఒక్కొక్కడి తోలు తీస్తా అంటూ కవిత తీవ్రంగా హెచ్చరించారు. ‘నేను మంచిదాన్ని కాదు, కాళ్ళు విరగొడతాను’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ప్రకంపనలు సృష్టించాయి.