|
|
by Suryaa Desk | Tue, Dec 09, 2025, 07:34 PM
హైదరాబాద్ నగరంలో ఏవైనా మేళాలు, ప్రదర్శనలు, ఇతరత్రా కార్యక్రమాలు వంటివి ఏర్పాటు చేయాలంటే... నగరం నడిబొడ్డున ఉన్న పీపుల్స్ ప్లాజా మైదానాన్ని ఎక్కువగా వాడుతుంటారు. సిటీ మధ్యలో ఉండటం, దీని చుట్టూ పర్యాటక ఆకర్షణలు ఉండటంతో... జనాలను సులభంగా ఆకర్షిస్తుందనే ఉద్దేశంతో పీపుల్స్ ప్లాజా మైదానం పేరుగాంచింది. ప్రస్తుతం ఇదొక్కటే ప్రధాన వేదికగా ఉంది. అయితే, దీని తరహాలోనే నగరంలో మరో ఈవెంట్ గ్రౌండ్ను ఏర్పాటు చేయడానికి రేవంత్ సర్కార్ ముందుకు వచ్చింది. మూడు ఎకరాల విస్తీర్ణంలో... రూ. 4 కోట్లతో దీన్ని అభివృద్ధి చేయనున్నారు.
పీపుల్స్ ప్లాజాకు అతి సమీపంలోనే... అన్ని అత్యాధునిక హంగులతో మరో ఈవెంట్ గ్రౌండ్ సిద్ధమవుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం మరియు ప్రసాద్స్ మల్టీప్లెక్స్కు మధ్యలో ఉన్న మూడెకరాల స్థలంలో ఈ మైదానాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. రాజకీయ సమావేశాలు, ఫిట్నెస్ ఈవెంట్లు, హస్తకళ, చేనేత ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ ఈవెంట్ గ్రౌండ్ను సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటికే ఇక్కడ సీసీ (సిమెంట్ కాంక్రీట్) పనులు పూర్తయ్యాయి. వర్షం నీరు నిలవకుండా పైప్లైన్ వేశారు. దాని కింది భాగంలో మెయిన్ సివరేజీ పైప్లైన్కు ఇబ్బందులు తలెత్తకుండా హైటెక్స్ గ్రౌండ్ మాదిరిగా దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ఈ కొత్త ఈవెంట్ గ్రౌండ్ను పేవర్ బ్లాక్స్తో సుందరంగా తయారు చేయడంతోపాటు... అవసరం అనుకున్న చోట ల్యాండ్ స్కేపింగ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈవెంట్ గ్రౌండ్ చుట్టూ రెయిలింగ్ గ్రిల్స్ను ఏర్పాటు చేశారు.
మెయిన్ రోడ్డు మీదుగా రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేశారు. అలాగే, వీవీఐపీ, ఎమర్జెన్సీల కోసం ఐమాక్స్ వైపుగా మరో రెండు ప్రవేశ ద్వారాలు ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. అంతేకాకుండా, ఇక్కడ నీటిని నిల్వ చేసి వినియోగించుకునేందుకు వీలుగా ఒక భారీ గుంతను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ గ్రౌండ్ తయారీ కోసం హెచ్ఎండీఏ సుమారు రూ. 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
త్వరలోనే ప్రారంభించబోయే ఈ ఈవెంట్ గ్రౌండ్ను రోజువారీ తరహాలో అద్దెకు ఇవ్వాలని హెచ్ఎండీఏ భావిస్తోంది. ఇప్పటికే పీపుల్స్ప్లాజా మైదానానికి లక్ష రూపాయలకుపైగా అద్దె వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో, కొత్త ఈవెంట్ గ్రౌండ్కు దాదాపు లక్షన్నర రూపాయల వరకు అద్దె వసూలు చేయవచ్చని హెచ్ఎండీఏ వర్గాలు తెలుపుతున్నాయి. త్వరలోనే ఈవెంట్ గ్రౌండ్ను ప్రారంభించాలనే ఉద్దేశంతో... పనులు శరవేగంగా జరుగుతున్నాయి.