|
|
by Suryaa Desk | Fri, Dec 12, 2025, 01:45 PM
నల్గొండ జిల్లాలో 21 ఏళ్ల బీటెక్ యువతి సర్పంచ్గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం సాధించినప్పటికీ.. దాన్ని కాదనుకుని గ్రామ సేవకే ఆమె ప్రాధాన్యమిచ్చారు. కనగల్ మండలం ఇస్లాంనగర్ గ్రామ సర్పంచ్గా బోయపల్లి అనూష ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన అనూష ఈ ఏడాదే బీటెక్ పూర్తి చేశారు. బీఆర్ఎస్ మద్దతుతో ఆమె సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీనియర్ నాయకురాలిపై 182 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆమె చొరవను, ఆలోచనను గ్రామస్థులు ఎంతగానో మెచ్చుకుని మద్దతుగా నిలిచారు.ఈ సందర్భంగా అనూష మాట్లాడుతూ.. చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే గ్రామాలు బాగుపడతాయనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తన గెలుపునకు సహకరించిన గ్రామ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.