|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 08:06 PM
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ వార్డులు గొప్ప వరంగా మారాయి. ఈ ఏడాది మే నెలలో రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని బోధనాస్పత్రుల్లో ఈ వార్డులను ప్రారంభించారు. పదేసి పడకలతో ప్రారంభమైన ఈ వార్డులు వృద్ధుల నుంచి విశేష స్పందన పొందుతున్నాయి. వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కేవలం రెండు నెలల కాలంలోనే ఈ జెరియాట్రిక్ వార్డుల ద్వారా లక్షలాది మంది వృద్ధులు వైద్య సేవలు పొందారు.2,59,880 మంది ఓపీ (ఔట్పేషెంట్) సేవలు, 32,313 మంది ఇన్పేషెంట్ సేవలు, 19,685 మంది ఫిజియోథెరపీ సేవలు వినియోగించుకున్నారు.
ముఖ్యంగా ఆర్థో, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, మానసిక వైద్య సేవలు పొందుతున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వృద్ధాప్యంలో మోకాళ్లు, ఇతర కీళ్ల నొప్పులు సాధారణ సమస్య. వీటికి ఫిజియోథెరపీ ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కో సెషన్కు రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చవుతుంది. కానీ జెరియాట్రిక్ వార్డుల్లో ఈ సేవలు పూర్తిగా ఉచితంగా లభిస్తున్నాయి. ఇది వృద్ధులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనకరంగా మారింది. జెరియాట్రిక్ వార్డులతో పాటు, వైద్యారోగ్య శాఖ వృద్ధుల కోసం మరిన్ని ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది.
ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, బస్తీ దవాఖానాల్లో ప్రతి గురువారం వృద్ధుల కోసం ప్రత్యేక క్లినిక్లు నిర్వహిస్తున్నారు. పల్లె, బస్తీ దవాఖానాలకు రాలేని వృద్ధులకు ఇంటివద్దకే వెళ్లి వైద్య సేవలు అందించాలని వైద్యశాఖ ఆదేశించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ, డయాగ్నొస్టిక్ కేంద్రాల వద్ద వృద్ధులకు క్యూలో నిలబడకుండా ప్రత్యేక సేవలు అందించాలని సూచించింది. ఈ వినూత్న కార్యక్రమం తెలంగాణలోని వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తుందని అధికారులు చెబుతున్నారు.