|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 06:44 PM
తెలంగాణ రాష్ట్రంలో ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)ల దీర్ఘకాల సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడానికి సిద్ధమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉండేది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ.. కోర్టు వివాదాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కీలక అంశాన్ని స్వయంగా చేపట్టారు. రాష్ట్రంలోని ఆర్ఎంపీ, పీఎంపీలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు) జారీ చేయాలన్న డిమాండ్పై అధికారులతో చర్చించారు.
సచివాలయంలో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిని ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేసి.. కొత్త జీవోను జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని వారికి సూచించారు.
ఇటీవల.. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీ, పీఎంపీల మెడికల్ ప్రాక్టీస్ నిబంధనలకు విరుద్ధమని భావించి.. పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగా కొద్దిమందిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యారోగ్య మంత్రిని కలిసి తమ గోడును వినిపించి, సమస్యలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం, అధికారులకు స్పష్టమైన సూచనలు చేసి, కొత్త జీవో రూపొందించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని స్పష్టం చేశారు.
గ్రామీణ వైద్యంపై దృష్టి..
ఈ సమస్య కేవలం ఆర్ఎంపీ, పీఎంపీల జీవనోపాధికి సంబంధించినది మాత్రమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి కూడా సంబంధించింది. ఎంబీబీఎస్ చదివి అర్హత కలిగిన వైద్యులతో ఆర్ఎంపీ, పీఎంపీలకు వస్తున్న వాగ్వివాదాలను నివారించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం.. చాలా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో ఉండటం లేదు.
ఈ లోటును ఆర్ఎంపీ, పీఎంపీలే పూరిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి.. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే అర్హత కలిగిన వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కూడా సీఎం అధికారులకు కొన్ని సూచనలు చేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకు మరింత మంది అర్హత కలిగిన వైద్యులు వెళ్లి సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ చర్యల ద్వారా తెలంగాణలో వైద్య రంగంలో గణనీయమైన మార్పులు వచ్చి.. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.