![]() |
![]() |
by Suryaa Desk | Fri, Jun 27, 2025, 08:26 PM
పటాన్చెరు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వ్యయంతో చేపట్టనున్న సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు కోసం భూమి కేటాయింపులు 90% పూర్తయ్యాయని.. అతి త్వరలో ప్లాంట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరువు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జలమండలి ఎస్టిపి విభాగం అధికారులు, ఎమ్మార్వోలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నూతన ఎస్టిపి ప్లాంట్లకు సంబంధించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా భూ కేటాయింపులు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని తిమ్మక్క చెరువు, మేళ్ల చెరువు, ఉసికే బావి, ఇక్రిసాట్, గండిగూడెం, బచ్చు గూడెం, అమీన్పూర్ పరిధిలోని చెరువుల సమీపంలో సీవేరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు 1100 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు. అమీన్పూర్ పరిధిలో ఏర్పాటు చేయనున్న ఎస్టిపి కోసం ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా స్థల కేటాయింపులు చేయబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 25 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం, 40% సంభందిత కాంట్రాక్టర్ కు HYAM పద్ధతిలో నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా చెరువులు, కాలువలను మురుగు నీరు, కాలుష్యం బారి నుండి సంరక్షించుకోవడంలో ప్లాంట్ల ఏర్పాటు కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ఈ సమావేశంలో జలమండలి ఎస్టిపి విభాగం చీఫ్ జనరల్ మేనేజర్ పద్మజ, అమీన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, జిన్నారం మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, తహసీల్దారులు,. మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.