![]() |
![]() |
by Suryaa Desk | Wed, May 21, 2025, 05:08 PM
ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా థియేటర్ల పరిస్థితి తీవ్రంగా దిగజారిపోతోంది. రోజురోజుకూ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుండటంతో వాటిని నడిపించటం కూడా కష్టతరంగా మారింది. కరోన తర్వాత ఓటీటీల వినియోగం పెరగడంతో థియేటర్లకు ఆదరణ తగ్గుతోంది. మరీ ముఖ్యంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు తీవ్రంగా నష్టాల బారిన పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్ ఎగ్జిబిటర్లు సంప్రదాయ రెంట్ విధానాన్ని పక్కన పెట్టి, ఆదాయంలో వాటా పొందాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఆందోళన జూన్ 1 నుంచి మొదలు పెట్టాలని చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో, థియేటర్లు తాత్కాలికంగా మూసివేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారని వార్తలు రావడంతో సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి నిరసన అనుకోవడం ఎంతవరకు సమంజసమన్న చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే వేసవి సీజన్ బాక్సాఫీస్ పరంగా నిరాశ కలిగించింది. పెద్దగా హిట్స్ లేకపోవడంతో థియేటర్లకు ఆడియన్స్ వచ్చిన దాఖలాలు కనిపించలేదు. ఇప్పుడు బాక్సాఫీస్కు ఊపు ఇవ్వగల సినిమాలు జూన్లో విడుదల కానున్నాయి. అందులో 'హరిహర వీరమల్లు', 'థగ్ లైఫ్', 'కుబేర', 'కన్నప్ప' లాంటి హైప్ ఉన్న చిత్రాలున్నాయి. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినది పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు'. అనేక అడ్డంకులు ఎదుర్కొన్న ఈ చిత్రం చివరకు జూన్ 12న రిలీజ్కు సిద్ధమవుతోంది. పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాంటి టైంలో ఆయన సినిమా విడుదలవుతుంటే థియేటర్లను బమూసివేసే సాహసం చేస్తారా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పవన్ అభిమానులు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు ఈ సినిమా రిలీజ్ను భారీగా నిర్వహించాలనే ప్లాన్ చేస్తున్నారు. అటువంటి సమయానికి ఎగ్జిబిటర్లు ఆందోళన ప్రకటించడం పరిశ్రమ మొత్తానికీ నష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమ డిమాండ్లు న్యాయంగానే ఉన్నా, వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే వాదన వినిపిస్తోంది.
Latest News