|
|
by Suryaa Desk | Mon, Apr 20, 2026, 10:24 AM
రామచంద్రాపురం : సమాజంలో అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహోన్నత వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని, ఆయన సూచించిన విధానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.మహాత్మ బసవేశ్వరుడి 893వ జయంతిని పురస్కరించుకొని.. రామచంద్రపురం డివిజన్ పరిధిలోని బీరంగూడ చౌరస్తాలో గల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 12వ శతాబ్దంలోనే కులం మతం వర్ణ వివక్షత లేని సమాజం కోసం అనుభవ మంటపాన్ని ఏర్పాటు చేసి, అన్ని మతాలు ఒక్కటేనని, మనుషులందరూ సమానమేనని చాటిచెప్పిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వరుడని కొనియాడారు. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతో.. తెలంగాణా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ట్యాంకు బండ్ పైన బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని, అదే స్ఫూర్తితో బీరంగూడలో 12 అడుగుల అశ్వారుడ బసవేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కాయమే (శరీరం) కైలాసమని చాటి శ్రమ జీవులకు అత్యంత గౌరవం తీసుకువచ్చారని అన్నారు.ఈ కార్యక్రమంలో వీరశైన లింగాయత్ సమాజం నియోజకవర్గం అధ్యక్షులు జగదీష్, సమాజం ప్రతినిధులు పాల్గొన్నారు.