|
|
by Suryaa Desk | Fri, Apr 10, 2026, 03:18 PM
కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం.ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు.బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావు గారితో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు.
జీవన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వారిలో వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు.
‘‘అన్నా... నన్ను మీతో కలిసి పనిచేయమని దేవుడే పంపిండు..’’
నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, తెలంగాణ సాధకుడు, రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది. కేసీఆర్ గారిని కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.‘‘తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీ దగ్గరికి పంపించిండు అన్నా.. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాళ్లకైనా మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది అన్నా..’’ అంటూ తన మనసు మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.కాగా.. జీవన్ రెడ్డి గారిని అనునయిస్తూ, వారిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ గారు, వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, దుశ్శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆతిథ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.