|
|
by Suryaa Desk | Sun, Aug 10, 2025, 05:59 PM
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతు భరోసా, రైతు బీమా, పసల్ బీమా యోజన వంటి పథకాలు అమలు అవుతున్నాయి. ఇప్పటికే రైతులకు పంట పెట్టుబడి సాయంలో ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని రైతు భరోసా నిధులు విడుదల చేసిన ప్రభుత్వం రైతు బీమా పథకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మకమైన పథకాల్లో ఒకటైన 'రైతు బీమా'కు కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువును ఆగస్టు 13గా వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు. కొత్తగా పట్టాదారు పాస్ బుక్స్ పొందిన రైతులు, అలాగే గతంలో పాస్ బుక్స్ ఉన్నప్పటికీ ఈ పథకంలో చేరనివారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
2018 ఆగస్టు 14న ప్రారంభమైన రైతు బీమా పథకం, రైతుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఈ పథకం కింద నమోదైన రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే.. అతని కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతుంది. ఇది సహజ మరణమైనా, ప్రమాదవశాత్తు మరణమైనా వర్తిస్తుంది. ఈ బీమా మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా నామినీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు కొన్ని పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవి. రైతు బీమా దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్ (లేదా MRO డిజిటల్ సంతకంతో కూడిన DS పేపర్), రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు.
ఈ పథకానికి దరఖాస్తు చేసే రైతు వయసు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1966 ఆగస్టు 14 నుండి 2007 ఆగస్టు 14 మధ్య జన్మించిన వారై ఉండాలి. రైతుల నుంచి ఎటువంటి ప్రీమియం వసూలు చేయకుండా, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఎల్ఐసి (LIC) కి ప్రీమియం చెల్లిస్తుంది. మొదటి ఏడాదిలో ఒక్కో రైతుకు రూ. 2,271.50 చొప్పున ప్రీమియం చెల్లించింది. అయితే ప్రతి సంవత్సరం ఈ ప్రీమియం మొత్తం పెరుగుతూ వస్తుంది. అయినా కూడా ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపై మోపకుండా తానే భరిస్తోంది. ఈ ఆర్థిక సహాయం వల్ల రైతు కుటుంబాలు ఆపద సమయంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడగలుగుతున్నాయి.
ఈ సంవత్సరం 2025-26 బీమా సంవత్సరం ఆగస్టు 14 నుండి ప్రారంభం కానుంది. ఈ నెల 13 వరకు అప్లికేషన్ చేసుకున్నవారి పేర్లను అధికారులు రైతు బీమా పోర్టల్లో నమోదు చేయనున్నారు. రాష్ట్రంలో దాదాపు 76 లక్షల మందికి పైగా పట్టాదారు పాస్ బుక్ ఉన్న రైతులు ఉన్నారు. అర్హులైన రైతులు తమ దరఖాస్తులను స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) కి సమర్పించాల్సి ఉంటుంది.