![]() |
![]() |
by Suryaa Desk | Wed, Jul 09, 2025, 08:39 PM
హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్ స్టేడియం) క్రికెట్ స్టేడియం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్టేడియం చుట్టూ ఉన్న కీలకమైన స్థలం, పార్కింగ్ ప్రాంతాలు, కొన్ని ప్రవేశ మార్గాలు ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ చేతికి వెళ్లడంతో స్టేడియంలో భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో స్టేడియం గేట్లను మూస్తూ ప్రీకాస్ట్ గోడలతో ప్రహరీ నిర్మాణం చేపట్టడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉప్పల్ పారిశ్రామిక వాడ కోసం కేటాయించిన 500 ఎకరాల భూమితో ఈ వివాదం ముడిపడి ఉంది. ఇందులో పెంగ్విన్ టెక్స్టైల్స్ అనే కంపెనీకి 46 ఎకరాలు దక్కాయి. ఆ కంపెనీ మూతపడిన తర్వాత అప్పుల కారణంగా ఆ భూమిని బ్యాంకు స్వాధీనం చేసుకుని వేలం వేసింది. అప్పటికే ఆ 46 ఎకరాల్లో 16 ఎకరాలను ఏపీఐఐసీ (APIIIC) ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కేటాయించింది. మిగిలిన 30 ఎకరాలను 2019లో జరిగిన వేలంలో బిల్డ్ బ్రిక్స్ అనే సంస్థ కొనుగోలు చేసింది.
అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ 23.5 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించినట్లు చెబుతోంది. HCA అదనంగా ఆక్రమించుకున్న స్థలంలో కొంత భాగాన్ని ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిందని టీఎస్ఐఐసీ (TSIIC) అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 22.5 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్న బిల్డ్ బ్రిక్స్ సంస్థ, తమ ఆస్తిని రక్షించుకునే క్రమంలో స్టేడియం గేట్లను దారిని మూస్తూ ప్రహరీ గోడను నిర్మిస్తోంది.
ఉప్పల్ స్టేడియం చుట్టూ ఉన్న 11 గేట్లలో సుమారు ఐదు గేట్లను మూస్తూ ఈ నిర్మాణం జరుగుతోంది. ఇప్పటివరకు క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల కార్లు, బైకులు పార్కు చేస్తున్న స్థలాన్ని కూడా సదరు కంపెనీ స్వాధీనం చేసుకోవడంతో దేశంలో అత్యంత సౌకర్యవంతమైన స్టేడియాల్లో ఒకటిగా పేరుగాంచిన ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఇకపై ఇరుకుగా మారే ప్రమాదం ఉంది.
టీఎస్ఐఐసీ ఉప్పల్ కమిషనర్ ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బిల్డ్ బ్రిక్స్ సంస్థ ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. పూర్తిస్థాయిలో గోడ నిర్మించి, పార్కింగ్ స్థలాన్ని మూసివేస్తే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం కష్టతరంగా మారనుంది. ఇప్పటికే మ్యాచ్ల సమయంలో ఉప్పల్ రోడ్లన్నీ అక్రమ పార్కింగ్తో నిండిపోతుండగా.. భవిష్యత్తులో ఈ సమస్య మరింత తీవ్రమవుతుందని అంచనా.
క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. స్టేడియం ప్రవేశ మార్గాలు, పార్కింగ్ స్థలాన్ని రక్షించే విషయంలో తక్షణమే చొరవ తీసుకోవాలని క్రీడాభిమానులు, క్రికెట్ వర్గాలు కోరుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఇప్పటివరకు ఈ విషయంపై బహిరంగంగా స్పందించకపోవడం గమనార్హం. ఈ వివాదం త్వరగా పరిష్కారమై ఉప్పల్ స్టేడియం తన ఖ్యాతిని నిలుపుకోవాలని క్రీడాప్రేమికులు ఆశిస్తున్నారు.