|
|
by Suryaa Desk | Tue, Oct 28, 2025, 11:28 AM
మోంథా తుపాను నేపథ్యంలో ధాన్యం, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎటువంటి నష్టం, ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పంట ఉత్పత్తులు కొనుగోలు కేంద్రాలకు చేరుకుంటున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించి, రైతులకు పూర్తి స్థాయిలో సహకరించాలని సూచించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్లు, సంబంధిత ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుకు ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీసి, మంత్రులతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురవడంతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని కారణంగా మంగళవారం పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ కాగా, బుధవారం ఈ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల 10 సెం.మీ.కు పైగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు, తుపాను ప్రభావం వల్ల మంగళ, బుధవారాల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
మోంథా తుపాన్ ప్రభావంపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుఫాన్ ప్రభావం, కొనుగోళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాన్ ప్రభావం కారణంగా ధాన్యం కొనుగోళ్లకు ఆటంకం కలగకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఉండేందుకు టార్పాలిన్లను ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 8,342 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, వీటిలో ఇప్పటికే 4,428 కేంద్రాలు ప్రారంభమయ్యాయని, మిగిలినవి త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు.
ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకూ 22,433 మంది రైతుల నుంచి 1.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కొనుగోలు చేసిన ధాన్యం విలువ దాదాపు రూ.431.09 కోట్లు ఉంటుందని తెలిపారు. తుఫాను పరిస్థితుల నేపథ్యంలో పంట కొనుగోళ్ల విషయంలో ఎటువంటి అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన అధికారులకు మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.