|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:25 PM
తెలంగాణ రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు శుభవార్త అందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో రికార్డు స్థాయిలో 20.01 శాతంగా నమోదైంది. ఈ సీజన్లో ఇంతటి అధిక ఓఈఆర్ నమోదు కావడంతో.. పామాయిల్ గెలల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. పామాయిల్ గెలల ధరల పెరుగుదల రైతులకు పెద్ద ఊరటనిచ్చే వార్త గా చెప్పవచ్చు.
ప్రస్తుతం పామాయిల్ గెలల టన్ను ధర రూ. 19,400గా ఉంది. రికార్డు స్థాయిలో ఓఈఆర్ నమోదు అయిన కారణంగా.. వచ్చే నెల నుంచి అమలులోకి రానున్న కొత్త ధర టన్నుకు రూ. 500 లకు పైగా పెరిగే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు రైతులకు ఆర్థిక భరోసాను అందించనుంది. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో అనేది ముడి పదార్థాల నుండి ఎంత శాతం నూనెను తీయగలుగుతున్నామనేది తెలిపే ముఖ్యమైన కొలమానం.
సాధారణంగా... నూనె గెలల బరువులో ఎంత శాతం నూనెను తీయగలుగుతున్నారో ఈ నిష్పత్తి తెలియజేస్తుంది. ఓఈఆర్ ఎంత ఎక్కువగా ఉంటే.. నూనె రికవరీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక రికవరీ కారణంగా.. ఫ్యాక్టరీల లాభదాయకత పెరుగుతుంది. దానికి అనుగుణంగా.. పామాయిల్ గెలల ధరలు కూడా పెరుగుతాయి. అంటే.. ఓఈఆర్ పెంపు అనేది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.
రికార్డు స్థాయిలో ఓఈఆర్ రికవరీ అయినందుకు ఆయిల్ ఫెడ్ అధికారులను, ఫ్యాక్టరీ సిబ్బందిని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. పామాయిల్ రైతులకు త్వరలో మహర్దశ పట్టనుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఆయిల్ పామ్ హబ్గా మారనుందని మంత్రి పేర్కొన్నారు. అప్పారావుపేట ఫ్యాక్టరీలో జరిగిన పామాయిల్ రైతుల సమావేశంలో పాల్గొన్న ఆయిల్ ఫెడ్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ.. ఓఈఆర్ పెరగడం రాష్ట్ర పామాయిల్ రైతుల శ్రమకు ప్రతిఫలం అని తెలిపారు.
ఈ శుభవార్త విన్న రైతులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అధిక ఓఈఆర్ రావడంలో ఫ్యాక్టరీ ఆధునికీకరణ, మెరుగైన ప్రాసెసింగ్ పద్ధతులు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ప్రభుత్వ సహాయం, రైతులకు సరైన సాంకేతికత అందించడం వలన ఈ రికార్డు సాధ్యమైంది. తెలంగాణలో పామాయిల్ సాగును విస్తృతం చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, రైతులకు నాణ్యమైన సాగు విధానాలపై ఇస్తున్న శిక్షణ ఈ ఫలితాలకు దోహదపడుతున్నాయి.