|
|
by Suryaa Desk | Sat, Dec 13, 2025, 07:35 PM
వారిద్దరూ ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. కొత్త జీవితం గురించి కోటి కలలు కన్నారు. కానీ పెళ్లి తర్వాత వారి ఆశలు, కలలు కల్లలయ్యాయి. అభిప్రాయభేదాలో లేక మరే ఇతర కారణమో తెలియదు కానీ.. పెళ్లైన నాటి నుంచి భార్యాభర్తలిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో సంతోషంగా సాగుతుందనుకున్న వైవాహిక జీవితం.. నిత్యం గొడవలతో నరకంగా మారడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన నవ వధువు దారుణానికి ఒడిగట్టింది.
పెళ్లైన మూడు నెలలకే ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన హైదరాబాద్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్లో వెలుగు చూసింది. పెళ్లైన నాటి నుంచి నిత్యం గొడవలు జరుగుతుండటంతో.. ఇలాంటి దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్, ప్రొద్దుటూరుకు చెందిన చందన జ్యోతి అనే యువతికి.. మూడు నెలల క్రితం వివాహం అయ్యింది. కొత్తగూడెంకు చెందిన యశ్వంత్తో ఆమె వివాహం జరిగింది. యశ్వంత్.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లయిన తర్వాత వీరిద్దరూ సిటీలోని.. మూసాపేట్లో నివసిస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా, సంతోషంగా జీవించాల్సిన ఈ నూతన జంట.. నిత్యం గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో తాజాగా శుక్రవారం కూడా వీరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చందన జ్యోతి.. బెడ్రూమ్లోకి వెళ్లి.. తలుపులు వేసుకుని.. ఆత్మహత్యకు పాల్పడింది.
గదిలోకి వెళ్లిన చందన జ్యోతి ఎంత సేపటికీ తలుపు తీయకపోవడంతో.. అనుమానం వచ్చిన యశ్వంత్.. తలుపులు బద్దలు కొట్టి చూడగా... అపస్మారక స్థితిలో కనిపించింది. అది గమనించిన యశ్వంత్ వెంటనే 108కు కాల్ చేశాడు. అంబులెన్స్ రాగానే చందనను దానిలో ఎక్కించి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చందనను పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. చందన మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఎన్నో ఆశలతో కుమార్తెకి పెళ్లి చేశాము.. తను పండంటి బిడ్డలను కని.. భర్తతో కలిసి సంతోషంగా ఉంటుందని భావిస్తే.. ఇలా అర్థాంతరంగా చనిపోయి తమకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందంటూ చందన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.