|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 07:21 PM
హైదరాబాద్లోని మాదాపూర్ , మేడ్చల్ ప్రాంతాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ దందాను పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడులలో బయటపెట్టారు. ఈ అక్రమ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న ఏడుగురు మహిళలు, ఒక వ్యక్తిని అధికారులు పట్టుకున్నారు. వీరిలో ప్రధాన సూత్రధారులుగా ఉన్న నర్రెద్దుల లక్ష్మిరెడ్డి, ఆమె కుమారుడు నరేందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మిరెడ్డి గతంలో కూడా సరోగసి తల్లిగా, ఎగ్ డోనర్గా పనిచేసిన అనుభవం ఉండటంతో.. ఆర్థికంగా వెనుకబడిన మహిళలను గుర్తించి, వారిని ఈ అక్రమ వ్యాపారంలోకి లాగి భారీగా డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
నిబంధనల ఉల్లంఘన, కేసుల చరిత్ర..
అధికారుల తనిఖీలలో ఈ ఫెర్టిలిటీ కేంద్రాలు ఎలాంటి అనుమతులు లేకుండానే పనిచేస్తున్నట్లు తేలింది. వీరు కమర్షియల్ సరోగసి, అక్రమ ఎగ్ ట్రేడింగ్ వంటి నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ దందాను ఒక పెద్ద రాకెట్గా నడుపుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నర్రెద్దుల లక్ష్మిరెడ్డికి ఇప్పటికే నేర చరిత్ర ఉందని పోలీసులు తెలిపారు. గతంలో 2024లో మహారాష్ట్రలో జరిగిన మానవ అక్రమ రవాణా కేసులో ఆమె నిందితురాలిగా ఉన్నట్లు తేలడంతో అధికారులు నివ్వెరపోయారు. గతంలో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన ఇలాంటి సంఘటనలో డాక్టర్ నమ్రత జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ దాడుల్లో పోలీసులు నిందితుల వద్ద నుంచి రూ. 6.47 లక్షల నగదు, ల్యాప్టాప్, వివిధ బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇది కమర్షియల్ సరోగసీ, అక్రమ ఎగ్ ట్రేడింగ్కు సంబంధించిన ఒక పెద్ద నెట్వర్క్లో భాగమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో సరోగసీ రెగ్యులేషన్ యాక్ట్, అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్, బీఎన్ఎస్ యాక్ట్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ దాడులు పిల్లలు లేని జంటల బలహీనతను ఆసరాగా చేసుకొని డబ్బు సంపాదించే ఇలాంటి మాఫియాల బాగోతాన్ని వెలుగులోకి తెచ్చాయి.