|
|
by Suryaa Desk | Mon, Aug 11, 2025, 07:39 PM
"భం భం భోలే… హర హర మహాదేవ!" శ్రావణ మాస ఆరంభాన్ని పురస్కరించుకుని, పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని అల్విన్ కాలనీలోని ఒడిశా వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోల్ భం కావడి యాత్ర ఆధ్యాత్మిక ఉత్సాహానికి నాంది పలికింది. యాత్ర ఇంద్రేశం గ్రామ శివాలయం నుండి ఘంటానాదాలు, డప్పుల ఘోష, శంఖధ్వనుల మధ్య భజనల మధుర స్వరాలతో ప్రారంభమైంది. గంగాజలంతో నింపిన కావడిని భుజాన మోసుకున్న భక్తులు పాదయాత్రగా అల్విన్ కాలనీ శివాలయం చేరుకున్నారు. మార్గమంతా "భం భం భోలే… హర హర మహాదేవ! శంభో శంకర!" అంటూ శివుని నామస్మరణతో గగనం మార్మోగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన BRS నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ గారు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వడ్డించారు. ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ పటాన్చెరు అనేది మినీ ఇండియా. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఐక్యతతో జీవిస్తున్నారు. ఒడిశా వాసులు భక్తితో నిర్వహించిన ఈ యాత్ర పవిత్రతకు ప్రతీక. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నా సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అన్నారు.అలాగే, ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఒడిశా సంఘ సభ్యులు, స్వయంసేవకులు, యువతకు ప్రిథ్వీరాజ్ గారు అభినందనలు తెలియజేస్తూ, భక్తులకు శ్రావణ మాస శుభాకాంక్షలు తెలిపారు.